టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ప్రస్తుత టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతోనే నిర్మాతగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. 2003లో వచ్చిన ఈ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఆది – చెన్నకేశవరెడ్డి సినిమాల తర్వాత వినాయక్కు ఇది మూడో సినిమా. నితిన్ కి జోడిగా నేహా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఈ సినిమాతో దిల్ రాజు టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.
దిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ సినిమాలో నటించిన కొందరు నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది కాస్త బాధాకరమైన విషయం. దిల్ సినిమాలో నితిన్ కు తండ్రిగా చలపతిరావు నటించారు. ఈ పాత్రకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆయన పండించిన కామెడీ బాగా పేలింది. చలపతిరావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
అలాగే దిల్ సినిమాలో హీరో నితిన్ మేనమామగా కమెడియన్ వేణుమాధవ్ నటించారు. వేణు కూడా కొన్ని సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే లెక్చరర్ పాత్రలో నవ్వులు పూయించిన సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కూడా ఎప్పుడో మృతి చెందారు. అలాగే హీరోయిన్ తాత, ప్రకాష్రాజ్ మామగా విలన్ పాత్రలో రాజన్ పి. దేవ్ అనే నటుడు కనిపించారు. ఆయన కూడా ప్రస్తుతం ఈ లోకంలో లేరు.
అలాగే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ నటించి మెప్పించారు. ఆయన కూడా అనారోగ్యంతో 2017 లోనే మృతి చెందారు. అలా ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాలో పాలుపంచుకున్న ఐదుగురు నటులు ఇప్పుడు లేకపోవడం బాధాకరం. వీరు లేకపోయినా ఈ సినిమా ఈ ఐదుగురు నటులకు ఎంతో మంచి పేరు వచ్చింది.