ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేసేవారు..ప్రజల్లోకి వెళ్ళి, వారి సమస్యలని తెల్సుకుని పరిష్కరించేవారు. కానీ ఈ రోజుల్లో అలా ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే అలా తక్కువ ఉన్నవారిలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఒకరని అంతా అనుకున్నారు. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన ఆయన..ప్రతి రోజూ గుడ్ మార్నింగ్ పేరిట ధర్మవరంలో ఊరు ఊరికి తిరగడం, అక్కడ ప్రజలతో మాట్లాడటం, సమస్యలు వినడం, వెంటనే వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పడం…అవసరమైతే అధికారులని సైతం మందలించడం, ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు కనిపించడం.
ఇదే కేతిరెడ్డి చేసేది..దీంతో వైసీపీ వాళ్లే కాదు..ఇతర పార్టీల కార్యకర్తలే కాదు..ఆఖరికి పక్క రాష్ట్రాల వారు కూడా అబ్బా..ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి. ప్రజల మనిషి కేతిరెడ్డి అనుకున్నారు. ఈ కథ మూడేళ్ళ వరకు బాగానే నడిచింది. కానీ నిదానంగా ఆయన ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళుతున్నారని, అసలు ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేకు..లైవ్ ఇవ్వడం ఎందుకు, వీడియోలు ఎందుకు, పైగా ఆ లైవ్ లో ఎమ్మెల్యే వాయిస్ మాత్రమే క్లియర్ గా వినపడుతుంది..మిగిలిన వారి వాయిస్ పెద్దగా. వినబడదు.
అంటే ఆయన మైక్ పెట్టుకున్నారని అర్ధమైపోతుంది. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నారని అర్ధమవుతుంది. ఆ వీడియో వరకే ప్రజల సమస్యలు..ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం కష్టమనే విమర్శలు వచ్చాయి. దీంతో కేతిరెడ్డి స్క్రిప్ట్ అని చాలా వరకు అర్ధమైంది.
ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో సాగినప్పుడు సంచలన విషయాలు బయటకొచ్చాయి. కేతిరెడ్డి..అక్రమంగా ఇసుక, మట్టి వ్యాపారం చేస్తున్నారని, వాటికి సంబంధించిన లారీల వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. ధర్మవరంలో చెరువు మధ్యలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ఉంది..అది కబ్జా చేసి కట్టుకున్నారని, లోకేష్ సెల్ఫీ తీసి పెట్టారు. అయితే అవన్నీ తాను రైతుల వద్ద కొన్న భూములని చెప్పి కేతిరెడ్డి..మంగళగిరిలో కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికొచ్చి..అదిగో అది అక్రమంగా కట్టారు అని కేతిరెడ్డి ఆరోపించారు.
కానీ కేతిరెడ్డి ఇక్కడే పప్పులో కాలేశారు. అది బాబు సొంత ఇల్లు కాదు..అద్దెకు ఉంటున్నారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే..ఆ ఇంటికి వైఎస్సార్ హయాంలోనే పర్మిషన్ వచ్చింది. దీంతో కేతిరెడ్డి కౌంటర్లు బూమ్ రాంగ్ అయ్యాయి. ఇక ఇటు ధర్మవరం చెరువూరులో కేతిరెడ్డి గెస్ట్ హౌస్..కబ్జా చేసి కట్టినదే అని లోకేష్ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డులు, రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఎమ్మెల్యే తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో కొనుగోలు చేసింది 25.38 ఎకరాలు మాత్రమే అని, అయితే, గుట్టపై మొత్తం 45 ఎకరాల భూమి ఉందని, గాలి వసుమతి పేరుతో కొనుగోలుచేసిన భూమిపోగా, మిగిలిన 20 ఎకరాలు కబ్జాచేశారని లోకేష్ గూగుల్ మ్యాప్ ఆధారంగా కౌంటర్ ఇచ్చారు.
మొత్తానికి కేతిరెడ్డికి అంతా రివర్స్ అయింది. ఇంతకాలం మంచి ఎమ్మెల్యే అనిపించుకున్న కేతిరెడ్డికి నెగిటివ్ మొదలైంది..ఇదే అంశం ధర్మవరం టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్కు బాగా కలిసొస్తుందనే చెప్పాలి. మొత్తానికి చాలా రోజుల తర్వాత ధర్మవరంలో పరిటాల పైచేయి సాధించారు. ఇదే ఊపు కొనసాగిస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మవరంలో గెలుపు సులువే.