అన్నగారు మంచి సీరియస్గా ఒక సినిమా చేస్తున్నారు. అదే శ్రీకృష్ణ పాండవీయం. ఉదయాన్నే 5 గంట లకు షూటింగ్ పెట్టారు. దీనికి కారణం.. మయ సభ షూటింగ్. దాదాపు 5 గంటల పాటు షూటింగ్ జరుగు తుందని.. ఏకబిగిన.. జరుగుతుందని కూడా ముందే ఎనౌన్స్ చేశారు. ఆ రోజు స్పాట్లో ఉండాల్సిన వారంతా 4గంటలకు స్పాట్లో ఉండాలని చెప్పారు. ఈ సీన్లో దుర్యోధనుడు పాత్రలో అన్నగారు నటించారు.
మయ సభలో ప్రవేశించడం.. పరాభవం పొందడం వంటికి ఈ సినిమాకు చాలా హైలెట్. దీనిని ప్రాణం పెట్టి మరీ రూపొందించారు అన్నగారు. ఇక, దుర్యోధనుడి పాత్ర అంటే.. మూడు గంటల పాటుమేకప్ ఉంటుంది. అప్పట్లో రాజస్థాన్ నుంచి దస్తులు.. ఆభరణాలు తెప్పించారు. దుర్యోధనుడు ధరించేవి ఖరీదుగా ఉండడంతో పాటు రాజస్థాన్ వాలాల చేతితో రూపొందించిన అంగీలను అన్నగారు తెప్పించారు. ఇలా.. దుర్యోధనుడి పాత్రకు ప్రాణం పోశారు.
అయితే.. మయసభ సీన్ షూట్ చేసేందుకు అందరూ వచ్చినా.. 3 గంటలకే రావాలని చెప్పిన మేకప్మెన్ మాత్రం 5 గంటలైనా రాలేదు. ఆయన గురించిన సమాచారం కూడా లేదు. దీంతో అన్నగారు మేకప్మెన్ కోసం.. వాకబు చేశారు. అంతకు ముందు రోజు ఓ స్టూడియోలో జరిగిన పార్టీలో ఆయన పాల్గొన్నారని.. అందుకే రాలేదేమోనని.. అసిస్టెంట్లు చెప్పారు.
అంతే చిర్రెత్తుకొచ్చిన అన్నగారు.. తనే మేకప్ వేసుకుని.. ఇక, ఆయనను రావొద్దన్నామని చెప్పండి! అని కబురు చేశారు. మేకప్ అంతా తానే వేసుకున్నారు. దుర్యోధనుడి పాత్రలో లీనమయ్యారు. దీంతో అక్కడున్న అందరూ స్టన్ అయ్యారు. అయితే.. రెండు రోజుల తర్వాత.. సదరు మేకప్మెన్ మళ్లీ వచ్చి.. అన్నగారిని బతిమాలడంతో కరిగిపోయారు. ఇదీ సంగతి..!