ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి వస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన రాజకీయాల్లో వస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఎప్పుడూ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. దీంతో ఎప్పటికప్పుడు అంబటి రాయుడు వ్యవహారం.. రాజకీయాల్లో హాట్ టాపిక్గానే ఉండిపోయింది. ఇదిలావుంటే, తాజాగా ఆయన రాజకీయాలపై పెదవి విప్పారు.
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అంబటి రాయుడు ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు.. క్రికెటర్గా మాత్రమే ఇప్పటి వరకు పరిచయం. ఇక, ఇప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ప్రకటించిన దరిమిలా.. ఆయన వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానన్నారు. తాజాగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పర్యటించిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. గ్రామీణుల సమస్యలు, అవసరాలు తెలుసుకొని, వాటిలో ఏ పనులు చేయగలను, ఏ అవసరాలు తీర్చగలను అనే అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. ముందు జనం నాడి తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలావుంటే, అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమేనని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. ముఖ్యమంత్రి జగన్తో నేరుగా అంబటికి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ టోర్నమెంట్కు వెళ్లే ముందైనా.. సీఎం జగన్ ఆశీస్సులు తీసుకునేవారు. అదేవిధంగా టోర్నమెంట్లు ముగించుకుని వచ్చాక కూడా.. జగన్తో భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ పరంగా కూడా ఆయన అనుకూలంగా ఉన్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలోకి ఆయన వెళ్ల డం ఖాయంగా కనిపిస్తోందనేచర్చ సాగుతోంది.