ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. ఇంతకుముందు ఉన్న 13 జిల్లాల స్థానంలో కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశారు. జగన్ గత ఎన్నికలకు ముందు ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు సీటు మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. ఇక కొన్ని జిల్లాలలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్సభ నియోజకవర్గ పరిధిలో లేకపోయినా సమీపంలో ఉన్న జిల్లాలలో విలీనం చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందా ? అంటే అవును అన్న సంకేతాలు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పరిపాలనకు అనుకూలంగా మరో జిల్లా ఏర్పాటుపై పరిశీలన జరుగుతుందన్నారు.
గిరిజనులకు పాలన అందుబాటులో ఉండేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు రాజన్నదొర తెలిపారు. అలాగే భవిష్యత్తులో మరో జిల్లా ఇక్కడే ఏర్పాటు అవుతుందని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి మంత్రి పేర్ని నాని కూడా 27వ జిల్లా ఉంటుందని ప్రకటన చేశారు.
ఇక నాని కూడా గిరిజిన ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేశారని.. మరో జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పగా.. ఇప్పుడు రాజన్నదొర కూడా అదే మాట చెప్పారు. అంటే గిరిజన జిల్లాల్లో ఇప్పటికే ఉన్న పార్వతీపురం, అరకుకు తోడుగా రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే సూచనలు ఉన్నాయి.