ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి జిల్లాలో టిడిపి రాణించడం లేదు. గత నాలుగు ఎన్నికల్లో చెప్పుకోదగిన విజయాలని సాధిచలేదు. కొద్దో గొప్పో 2014 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి 5 సీట్లు గెలుచుకుని పర్లేదనిపించింది. ఇక వైసీపీ హవానే ఇక్కడ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. టిడిపికి ఒక్క కుప్పం మాత్రం దక్కింది. అది కూడా చంద్రబాబు మెజార్టీ 30 వేలకు పడిపోయింది.
అయితే అలాంటి పరిస్తితి నుంచి జిల్లాలో టిడిపి పుంజుకుంటూ వస్తుంది. పలు నియోజకవర్గాల్లో ఆధిక్యంలోకి కూడా వస్తుంది. ఇప్పటికే నగరి, కుప్పం, మదనపల్లె స్థానాల్లో టిడిపికి ఆధిక్యం ఉంది. అదే సమయంలో కొన్ని ఎన్నికల నుంచి గెలుపుకు దూరమైన పీలేరు.. వరుసగా ఓడిపోతున్న పలమనేరులో ఈసారి టిడిపి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.
గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కంచుకోటగా ఉన్న పీలేరులో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఉంది. అయితే వయోః భారంతో ఈ సారి ఆయన పోటీ చేస్తారా ? లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో టిడిపి నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బలం పెరిగింది.
పైగా నల్లారి ఫ్యామిలీకి పీలేరులో సొంత బలం కూడా ఉంది. ఈ సారి అక్కడ కిషోర్ గెలుపు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఇటీవల సర్వేల్లో కూడా పీలేరులో నల్లారి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని తేలింది. ఎప్పుడో 1994లో టిడిపి ఇక్కడ గెలిచింది..ఇప్పుడు 2024లో గెలిచే ఛాన్స్ వచ్చింది. అటు పలమనేరు 2009లో టిడిపి గెలిచింది..2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయింది.
అయితే ఈ సారి ఇక్కడ టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. టిడిపి నేత అమర్నాథ్ రెడ్డి పుంజుకున్నారు. ఈ సారి అమర్నాథ్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి పీలేరు-పలమనేరులో వైసీపీని టిడిపి చావు దెబ్బతీసేలా ఉంది. అమర్నాథ్ – నల్లారి కాంబినేషన్లో ఈ రెండు సీట్లలో సైకిల్ దూసుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.