వైసీపీలో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. దీని వల్ల పార్టీకి అంతర్గతంగా నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో డ్యామేజ్ కనిపిస్తుంది. అయితే వైసీపీ ఆధిపత్య పోరుని కనిపించకుండా కవర్ చేస్తుంది. కానీ లోలోపల మాత్రం అది వైసీపీకి భారీ నష్టమే చేసేలా ఉంది.
అయితే గత ఎన్నికల్లో 16కి 14 సీట్లు ఇచ్చిన కృష్ణా జిల్లా వైసీపీలో రచ్చ వేరే స్థాయిలో ఉంది. ఇక్కడ స్థానికంగా నేతల మధ్య ఎక్కడకక్కడ పోరు నడుస్తోంది. మొదట పోరు ఎక్కువగా కనిపిస్తున్న స్థానం వచ్చి మైలవరం..ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ , మంత్రి జోగి రమేశ్ల మధ్య రచ్చ నడుస్తోంది. అటు పెడనలో జోగి, ఉప్పాల రామ్ ప్రసాద్ల మధ్య పోరు ఉంది. అక్కడ ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటారు. ఒకరినొకరు చెక్ పెట్టుకోవాలని చూస్తారు.
ఇటు మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరిల మధ్య అసలు పడటం లేదు. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తూనే ఉంది. ఇటు గన్నవరంలో చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే వంశీకు వ్యతిరేకంగా యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు ఉన్నారు. పెనమలూరులో ఎమ్మెల్యే పార్థసారథిపై ద్వితీయశ్రేణి క్యాడర్ అసంతృప్తిగా ఉంది. విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మధ్య రచ్చ ఉంది.
వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్కు వైసీపీలో కాపు వర్గం యాంటీగా ఉంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాబు, వెల్లంపల్లికి పడని విషయం తెలిసిందే. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధికి వ్యతిరేక వర్గం ఉంది. నందిగామలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ తీరుకు వ్యతిరేకంగా పార్టీలో ద్వితీయ శ్రేణి వర్గం భగ్గుమంటోంది. ఇలా కృష్ణా వైసీపీలో పోరు పీక్స్ లో ఉంది. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఈ గ్రూపుల గోలే పార్టీని నిలువునా ముంచేసేలా కనిపిస్తోంది.