ప్రజాస్వామ్య విలువలకు ఎలా తూట్లు పొడిచాను ఓ ఎమ్మెల్యే స్వయంగా బయట పెట్టుకోవడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే పరిపాలించే పడే ప్రభుత్వమే అని అబ్రహం లింకన్ మహా సయుడు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో గొప్ప విలువ ఉంది. అలాంటి ఓటు హక్కును అమ్ముకోవటం చాలా తప్పు అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అయితే ఒకరి ఓటును మరొకరు వేయటం చాలా ఘోరం నేరం కూడా. కేవలం తాను దొంగ ఓట్లతోనే గెలిచానని ఓ ఎమ్మెల్యే స్వయంగా తన నోటితో చెప్పటం చాలా బాధాకరం.
ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఏపీలోని కోనసీమ జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన స్వయంగా తన నోటితో తానే నేను దొంగ ఓట్లతో గెలిచా. నా సొంతూరు చింతలమోరిలో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. అక్కడ ఓట్లు ఉంటాయి కానీ ఎవరో ఎవరికీ తెలియదు.. గతంలో వచ్చిన 800 వాట్ల మెజార్టీ కూడా అలాగే వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే రాపాక అలా మాట్లాడుతూ ఉండగా దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఇప్పుడు అది వైరల్ గా మారింది. వెంటనే రాపాకపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఆయన తనంతట తానుగా దొంగ ఓట్లతో గెలిచాను అని చెప్పటం చాలా బాధాకరం అని ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండిస్తున్నారు. ఇక 2009 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన గత సాధారణ ఎన్నికలలో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు.
ఆ తర్వాత జనసేనకు దూరమై వైసిపికి దగ్గరయ్యారు. మరి రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చేయడంతో రాపాక అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు సమాచారం. ఇక ఆయన శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.