టీడీపీ ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనూరాధ కెరీర్‌లో ఇన్ని సంచ‌ల‌న రికార్డులు ఉన్నాయా…!

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీకి షాక్ ఇస్తూ టీడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ సంచలన విజయం సాధించారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల విజయం సాధించి మంచి ఉత్సాహంతో ఉన్న టీడిపి శ్రేణుల ఆనందం అనురాధ విజయంతో రెట్టింపు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరికంటే ఎక్కువగా 23 ఓట్లు సాధించి గెలిచిన అనురాధ రాజకీయ ప్రయాణం ఒక సంచలనం. అనుకోకుండా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె విజయవాడ మేయర్‌ గా తనదైన ముద్ర వేశారు. ఆమె కుటుంబానికి.. రాజకీయాలకు అసలు సంబంధం లేదు.

ఆమె తండ్రి పుల్లారావు ఐఆర్ఎస్ ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేసే పదవి విరమణ చేయగా.. తల్లి గృహిణి అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు జరుగుతూ ఉండేవి. అలా అనురాధ ప్రాథమిక విద్య హైదరాబాద్ సెంట్ అన్స్‌లో చదివారు. ఇక హైస్కూల్ ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. బీఎస్సి ఎలక్ట్రానిక్స్ గుంటూరు జెకేసి కాలేజీలో చదివిన ఆమెకు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప. అనంతరం ఆమె ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు.

ఆమెకు అటు పుట్టింటి వైపు నుంచి.. ఇటు మెట్టింట వైపు నుంచి రాజకీయాలతో సంబంధం లేదు. ఇక ఆమె రాజకీయాల్లోకి రావటమే ఒక సంచలనం. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ చేశారు. ఆమె ఒక రోజు పేపర్ చదువుతుండగా ఆ వార్త ఆమెను ఆకర్షితురాలను చేసింది. దీంతో తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. అప్పట్లో కార్పొరేటర్, మేయర్ పదవులకు విడివిడిగా ఎన్నికలు జరిగేవి. టీడిపి నుంచి మేయర్ గా పోటీ చేసేందుకు మొత్తం 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 

ఆ రోజు విజయవాడ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. దీంతో అక్కడ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చంద్రబాబు స్వయంగా ఇంటర్వ్యూలు చేశారు. టెక్నాలజీ అంటే ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అనురాధ చెప్పిన సమాధానాలు.. ఆమె పంచుకున్న అభిప్రాయాలు బాగా నచ్చాయి. ఉన్నత విద్యావంతురాలు కావడంతో విద్యారంగంపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె చక్కగా సమాధానాలు ఇచ్చారు. దీంతో విజయవాడ టీడిపి మేయ‌ర్‌ అభ్యర్థిగా ఆమెని చంద్రబాబు ఎంపిక చేశారు. నాడు జరిగిన ప్రత్యక్ష ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి నాగరాణి – కమ్యూనిస్టు. పార్టీల నుంచి తాడి శకుంతల పోటీ చేశారు.

 

గట్టి పోటీ ఎదురైనా అనురాధ 7 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయవాడ మేయ‌ర్ గా సంచలన విజయం సాధించారు. ఆమె మేయర్ అయ్యాక కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి, కమ్యూనిస్టు కార్పొరేటర్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికలలో విజయవాడలోని మొత్తం 50 కార్పోరేటర్ స్థానాలలో టీడిపి కేవలం 11 మాత్రమే గెలిచింది. చివరకు ఆమె కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్పొరేటర్లను ఎదుర్కొనేందుకు ట్యూష‌న్ పెట్టించుకుని ప్రతి విషయంపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్నారు. ఆమె మేయర్ గా ఉన్నప్పుడే కృష్ణా పుష్కరాలు జరగడంతో రాజకీయంగా అనేక విషయాలు నేర్చుకునేందుకు ఎంతో దోహ‌ద‌ పడ్డాయి.

ఇక మేయర్ పదవి పూర్తయ్యక చాలా రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడ్డారు. 2007 నుంచి మళ్లీ పార్టీ కార్యకర్తలలో చురుకుగా పాల్గొన్నారు. 2009, 2019 రెండు ఎన్నికలలోను ఆమెకు మంగళగిరి అసెంబ్లీ సీటు వస్తుందన్న ప్రచారం జరిగింది. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న దూరం కావడంతో ఆసక్తి చూపలేదు. ఇక 2017లో చంద్రబాబు ఆమెను ఎమ్మెల్సీకి ఎంపిక చేశారు. అయితే నామినేషన్ వేసేందుకు సరైన పత్రాలు లేకపోవడంతో ఆ అవకాశం ప్రతిభ భారతికి వెళ్ళిపోయింది. అలా ఆమె ఎప్పుడు దురదృష్టవంతురాలుగా మిగిలిపోయారు. అయినా కూడా చంద్రబాబు ఆమెకు ఎప్పటికప్పుడు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడంతో పాటు సంచలన విజయం సాధించారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp