బిగ్ బ్రేకింగ్‌: వైసీపీలో బిగ్ వికెట్ డౌన్‌… పార్టీ జిల్లా అధ్య‌క్షుడు రాజీనామా..

ఏపీలో అధికార వైసీపీలో అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఎగ‌సి ప‌డుతున్నాయి. అస‌లు ఎమ్మెల్యేలే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఉత్త‌రాంధ్ర వైసీపీలో బిగ్ వికెట్ ప‌డింది. ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్య‌క్షుడే తన ప‌ద‌వితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.

పైగా కీల‌క‌మైన విశాఖ జిల్లా అధ్య‌క్షుడే పార్టీతో పాటు ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం వైసీపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఆ నేత ఎవ‌రో కాదు విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు. యేడాదిగా ఎన్నో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదన్న ఆయ‌న‌… దిగువ స్థాయిలో సమస్యలు తీర్చలేనపుడు పదవిలో ఉండి లాభం లేదని… అందుకే పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు చెప్పారు.

కొంతకాలంగా పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య సీట్ వార్ నడుస్తోంది. అయితే రీసెంట్‌గా పెందుర్తిలో వైయ‌స్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్‌ను పెందుర్తిలో మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అక్క‌డ ఓట‌ర్ల‌కు చెప్పేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌మేష్‌బాబుకు సీటు రాద‌ని తేలిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ వీడిన‌ట్లు తెలుస్తోంది. పంచ‌క‌ర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పెందుర్తిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటుగా పంచకర్ల టీడీపీలో చేరి య‌ల‌మంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డే టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు.

ఆ త‌ర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక్క‌డ కూడా ఎంతో కాలం ఉండ‌లేక‌పోయారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన వ‌చ్చే ఎన్నిక‌ల లోపే ఆ పార్టికి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు ర‌మేష్ తిరిగి టీడీపీలోకి వెళ‌తారా ? లేదా జ‌న‌సేన‌లోకి అన్న‌ది చూడాలి.