జయప్రద, జయసుధ, జయచిత్ర.. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన జయత్రయం. అందంలోనూ, అభినయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. వీళ్లలో జయప్రదకు ఆ రోజుల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన జయప్రద హిందీ ఫీల్డ్కు వెళ్లి అక్కడ కూడా అగ్రకథానాయికగా వెలిగారు. జయప్రదే ముందుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్లు కొట్టారు.
శ్రీదేవి హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యే వరకూ అక్కడ ఆమె హవా కొనసాగింది. అయితే, శ్రీదేవి బాలీవుడ్లోకి వెళ్లాక మాత్రం జయప్రద హవా తగ్గింది. ఆమెకు హిందీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. శ్రీదేవి ఒక్కసారిగా నేషనల్ స్టార్ హీరోయిన్ అయిపోయారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు తెరమీదికి వచ్చాయి. శ్రీదేవి వల్లే జయప్రదకు అవకాశాలు రాకుండా పోయాయనే టాక్ కూడా వినిపించింది.
అయితే.. కేవలం హిందీ సినిమా రంగంలోనే కాదు.. అసలు తెలుగు ఇండస్ట్రీలో కూడా జయప్రద, శ్రీదేవి ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించినా..ఎప్పుడూ.. పలకరించుకునేవారు కాదు. కేవలం డైలాగులకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే విషయంలో దాసరి నారాయణరావు కూడా మధ్యవర్తిత్వం చేసి.. ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. కానీ, ఇద్దరూ కలుసుకోలేక పోయారు.
దీనిపై జయప్రద ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు జయసుధ చాలా క్లోజ్. తనతో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉండేది. వాళ్లమ్మ జయసుధ కన్నా నన్నే బాగా చూసేది. శ్రీదేవి చాలా యారొగెంట్. ఆమెకు, నాకూ తెలియని దూరం ఉండేది. హెల్దీ కాంపిటిషన్ ఉండాల్సింది పోయి మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఇబ్బందిగా ఉండేది. ఇద్దరం కలిసి చాలా పిక్చర్స్ చేశాం. చాలా ఇంటిమసీ ఉండేది ఆన్స్క్రీన్లో లైట్స్ ఆఫ్ కాగానే నా కుర్చీ అటూ, ఆ అమ్మాయి ఇటూ ఉండేది. అందరూ కలపాలని ట్రై చేశారు. మాకు మనస్పర్థలు ఏమీ లేవు. మా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు అంతే. అయినా శ్రీదేవిపై నాకెప్పుడూ ద్వేషం లేదు.’’ అని జయప్రద తెలిపింది.