ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల ముందు షాకులు తప్పేలా లేవు. గత ఎన్నికలకు ముందు అప్పటి అధికార టీడీపీ నుంచి కొందరు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీకి కూడా అలాంటి రివర్స్ షాకులే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కోస్తా జిల్లాల నుంచే ముగ్గురు వైసీపీ ఎంపీలు పార్టీ మారిపోతారని గట్టిగా ప్రచారం నడుస్తోంది.
ఇందులో ముఖ్యంగా వినిపించే పేరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్నదేవరాయుల పేరు. ఈయన ముందు నాన్ కాంట్రవర్సీగా ఉన్నారు. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఎలాంటి వివాదాలు లేకుండా రాజకీయం చేసి పార్టీలకు అతీతంగా ప్రశంసలు అందుకున్నారు. అసలు లావుకు, ఆయన తండ్రి రత్తయ్యకు టీడీపీ అధినేతతో మంచి పరిచయాలే ఉన్నాయి.
లావు టీడీపీలోకి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనకు గుంటూరు లేదా నరసారావుపేటలో ఏ ఎంపీ సీటు ఇస్తారన్న దానిపై టీడీపీలో చర్చ నడుస్తోంది. ఇక రెండో పేరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు. ఆయన గత ఎన్నికల ముందు వరకు టీడీపీ ఎమ్మెల్సీ. ఆయన వైసీపీలోకి వెళ్లి పేరుకే ఎంపీ అయినా కూడా ఆయనకు ఒరిగిందేమి లేదు.
అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని ఆయన కసితో ఉన్నారు. మార్కాపురం నుంచి వైసీపీ సీటు కోసం ఓ కన్నువేసినా అది వర్కవుట్ అయ్యేలా లేదు. ఒకవేళ టీడీపీలోకి వస్తే కావలి టిక్కెట్ ఇస్తామని హామీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా గత ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళ్లి ఎంపీ అయ్యారు.
ఈ సారి జగన్ ఆయనకు నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్రెడ్డితో పోటీ పడాలి. నియోజకవర్గంలో కోటంరెడ్డి బలమైన నేత… ఆయన్ను ఆదాల ఎంత వరకు ఢీ కొడతారన్న సందేహాలు ఉండగానే.. ఆయన పార్టీ మార్పుపై కూడా సందేహాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ ముగ్గురు ఎంపీలే కాదు.. వైసీపీ నుంచి పలువురు కీలక నేతల పేర్లు కూడా జిల్లాల వారీగా జంపింగ్ లిస్టులో వినిపిస్తున్నాయి.