ఏపీలో జగన్ ఫస్ట్ సేల్ ‘వైజాగ్’..!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న తండ్రి దివంగ‌త రాజ‌శేఖర్‌రెడ్డి బాట‌లోనే అడుగులు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో భూముల విక్ర‌యాల‌కు రెడీ అయ్యారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండటం… తీర ప్రాంతం కావడంతో.. అన్ని రకాల అనుకూలతలు, వ‌న‌రులు విశాఖ లో ఉన్నాయి. దీంతో న‌గ‌రం శరవేగంగా విస్తరిస్తోంది. విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 13 మండలాలు ఉంటే, వాటిలో పది మండలాల్లో.. విలువైన భూములున్నాయి. ఈక్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వం విశాఖపట్నంపై గురి పెట్టింది.  

విశాఖతోపాటు చుట్టుపక్కన గ‌ల‌ పది మండలాల్లోని నాలుగు వేల ఎకరాల భూముల‌పై క‌న్నేసిన జ‌గ‌న్ స‌ర్కార్‌..   వాటిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. భూములను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమ‌గ్నం అయ్యారు.  విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను గత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భూ  సేకర‌ణ చేప‌ట్టాయి. అయితే ఆదాయం పెంచుకునే కార‌ణం చూపుతూ ప్రభుత్వం అత్యంత విలువైన భూముల‌ను విక్ర‌యించేందుకు సిద్ధ‌మైంది.

ఇప్ప‌టికే గుర్తించిన భూములకు సంబంధించి సర్వే నంబర్లు, కోర్టు కేసులు, ఇతర అభ్యంతరాలపై అధికారులు కసరత్తు మొద‌లుపెట్టారు. తొలి దశలోనే ప్రభుత్వం విశాఖ భూముల‌ను విక్రయించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంలోని కొంద‌రు పెద్దలు కూడా.. విశాఖ భూములపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కార్యక్షేత్రంగా విశాఖనే ఎంచుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా విశాఖలో భూముల‌ను  అమ్మ‌కానికి పెట్టారు.  

తొలిసారి ఆయన అధికారంలోకి వచ్చిన 2004లో హైదరాబాద్‌తో పాటు విశాఖలో భూములను విక్ర‌యించారు. విశాఖ శివారు ప్రాంత మండలాల్లో భారీగా భూములు అమ్ముకున్నారు. అప్పట్లోనే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను అమ‌లు చేసేందుకు ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కూడా రంగంలోకి దిగారు. ఈ సారి తండ్రిని మించి ఆయన ఎన్ని వేల కోట్ల ఆదాయాన్ని విశాఖ భూముల నుంచి సంపాదిస్తారో వేచి చూడాలి..

Tags: AP, Government Land Sale, Vizag, YS Jagan, ysrcp