టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 160 రోజులుగా అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు సీమ సహా.. నెల్లూరు జిల్లాలను కూడా దాటుకుని.. ప్రకాశం జిల్లాలో ఈ పాదయాత్ర సాగుతోంది. అయితే.. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందిన లభిస్తుండడం.. ప్రజలు వారి వారి సమస్యలను నారా లోకేష్తో చెప్పుకోవడం వంటి పరిణామాలు.. రోజూ మీడియాలో వస్తున్నాయి.
భారీ ఎత్తున తరలి వస్తున్న ప్రజలు ఆయన ప్రసంగాల కోసం.. వర్షంలో సైతం ప్రజలు ఎదురు చూస్తున్న విధానం వంటివి చర్చకు కూడా వస్తున్నాయి. అయితే.. ఈ పరిణామాలను మరి జీర్ణించుకోలేక పోతున్నా రో.. లేక పాదయాత్ర అంటే ఒకే ఒక్క కుటుంబానికి ఉన్న పేటెంట్ హక్కుగా భావిస్తున్నారో తెలియదు కానీ.. నారా లోకేష్పై మాత్రం వైసీపీ నాయకులు వింత ప్రచారం.. విడ్డూరపు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
నారా లోకేష్ తాజాగా ప్రకాశం జిల్లాలో బైకు, కార్ మెకానిక్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకున్నారు. అదేసమయంలో వారితో కలిసి కింద కూర్చుని టీ తాగారు. అయితే.. `సేమ్ టు సేమ్` అనే క్యాప్షన్తో గతంలో భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ ఫొటోను ఈ ఫొటోను పక్క పక్కన పెట్టి.. ఇలాంటివి ఎన్ని చేసినా.. ఒక్కటే అని ఇద్దరూ ఇద్దరూ.. `పప్పు`లు అని కామెంట్లు చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఐటీడీపీ విభాగం ఒక వినూత్న ప్రయత్నం చేసిం ది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను వినియోగించి.. యువగళం పాదయాత్రపై టీవీ న్యూస్ను రూపొందిం చింది. దీనిలో యాంకర్ అంటూ.. ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఏఐతోనే ఒక మనిషిని సృష్టించి వార్తలు చదివించారు. అయితే.. దీనిని కూడా వైసీపీ నాయకులు తమ రాజకీయాలకు వాడుకున్నారు.
పాదయాత్రకు ప్రజలు రావడం లేదని, ఏ టీవీ కూడా దీనిని కవర్ చేయడం లేదని.. అందుకే ఇలా చేశారంటూ. వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. మరి గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎవరైనా ఇలా వ్యాఖ్యానించారా? అనేది ప్రశ్న. నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎందుకింత కసి? ఏడుపు? అంటున్నారు టీడీపీ నాయకులు.