సీనియర్ ఎన్టీఆర్ ఏదైనా పంతం వేశారంటే ఆ పంతం నెగ్గేవరకు ఆయన ఎక్కడా వెనక్కు తగ్గరు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయంగా తెలుగు వారికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన ఘనుడు సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం… వీరిలో ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరో అయ్యింది మాత్రం బాలకృష్ణ మాత్రమే.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన పిల్లల్లో బాలకృష్ణ, రామకృష్ణ వివాహానికి వెళ్లలేదు. వీరిద్దరి వివాహాలు ఒకేరోజు జరిగినా ఈ ఇద్దరు కొడుకుల వివాహాలకు ఎన్టీఆర్ రాలేకపోయారు. ఇక రామకృష్ణ, బాలకృష్ణ వివాహం తిరుపతిలో బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగాయి. వీరి వివాహ సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజాయాత్రలో బిజీగా ఉన్నారు.
ఆ టైంలో ఎన్నికల మూమెంట్ వచ్చేసింది. నాటి ఆంధ్రా జనాలు అందరూ ఎన్టీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా ఆయన ప్రజాయాత్రలో ఉంటున్నారు. దీంతో ప్రజాస్పందన చూసిన ఎన్టీఆర్కు తన కొడుకుల వివాహానికి కూడా వెళ్లాలనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ లేకుండానే తన కొడుకుల పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఎన్టీఆర్ భార్య బసవతారకమే దగ్గరుండి మరీ ఈ పెళ్లిళ్లు జరిపించారు.
అయితే తిరుపతిలో వివాహం పూర్తయ్యాక బాలకృష్ణ, రామకృష్ణ దంపతులు యాత్రలో ఉన్న ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారట. ఇక ఎన్టీఆర్కు కొడుకుల వివాహాలు కన్నా కూడా.. ప్రజల గురించి ఆలోచించడం.. వారి సమస్యలపైనే ఫోకస్ ఉండేది అనేందుకు ఇదే నిదర్శనం అంటూ.. నాడు జరిగిన ఈ సంఘటనను ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగిన సమయంలో ప్రముఖ నటుడు మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.