అనేక ఇబ్బందులు.. అనేక ఒడిదుడుకులు.. సొంత పార్టీలోనే ఎగస్పార్టీ స్వరాలు.. ఇవన్నీ.. నిన్నటి కథ. కానీ, ఇప్పుడు ఆయన వస్తున్నారంటే.. కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆయన బయట కు కాలు పెడుతున్నారంటే.. పనులు మానుకుని కూడా ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారట. దీంతో ఇప్పుడు ఎటు విన్నా.. ఎవరినోట విన్నా.. పల్లె పేరు మార్మోగుతోంది. స్థానికంగా పెద్దాయన అని పిలుచుకునే టీడీపీ కేడర్కు ఇప్పుడు సర్వస్వం అయ్యారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఉన్న రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నుంచి గతంలో గెలిచి చంద్రబాబు హయాంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్న పల్లె రఘునాథరెడ్డిగత ఎన్నికల్లో మాత్రం పరాజయం పొందారు. సాధారణంగా ఒక్క ఓటమితో ప్రజానాయకులకు ఏమీకాదు. కానీ, పల్లె విషయంలో మాత్రం సొంతపార్టీలో నే కొందరు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పారు.
వచ్చే ఎన్నికల్లో పల్లెకు పోటీగా నాయకుడిని కూడా తయారు చేశారు. అయినా.. ఎంతో సంయమనంతో ముందుకు సాగిన పల్లె.. కేడర్కు చేరువ అయ్యారు. ఇదే ఇప్పుడు ఆయనకు బలంగా మారిందని అంటున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలపై ఆయన పల్లె బాట పట్టారు. దీనిని కొన్నాళ్లగా ఆయన నిర్విరామంగా చేస్తున్నారు. అదేసమయంలో సొంత పార్టీలో తనకు ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు.
వీటికి తోడు పార్టీ అధిష్టానం దగ్గర క్లీన్ ఇమేజ్ ఉండడంతో ఇది మరింతగా పల్లెకు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పుడు పల్లె ఉత్సాహంగా ఉన్నారని ఆయన కేడర్ చెబుతోంది. ఈ క్రమంలో ఆయన ఇదే లాస్ట్ చాన్స్ అని కూడా చెబుతున్నారట. వచ్చే ఎన్నికల తర్వాత తాను రాజకీయంగా రిటైర్ అవుతానని ఆయన చెబుతుండడంతో ఈ సారి ఖచ్చితంగా తమ పెద్దాయనను గెలిపించుకునేందుకు ప్రజలు రెడీ అవుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సో. మొత్తానికి పల్లెకు జన నీరాజనం అయితే ఖాయమని అంటున్నారు.