తెలంగాణలో మరో మూడు నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు జోక్యంతో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై అనర్హత వేటు వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో వనమా పై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
వనమా గెలుపును ఆశ్రయిస్తూ జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా ఆస్తులు సక్రమంగా చూపించలేదని అభియోగాలు ఉన్నాయి. ఇవి నిజం అని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 లోను గెలిచిన ఆయన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009 – 2014 ఎన్నికలలో ఓడిపోయిన వనమా 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఆ ఎన్నికలలో కేవలం 4000 ఓట్ల తేడాతో జలగం వెంకట్రావు పై నెగ్గారు. ఇక జలగం వెంకట్రావు విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండో కుమారుడు కావటం విశేషం.
ఆయన సోదరుడు జలగం ప్రసాదరావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రిగా పనిచేశారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన జలగం వెంకటరావు 2004లో తొలిసారి సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికలలో బిఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికలలో వనమా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.