వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్న ప్రధాన లక్ష్యం. పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసిన శపథాన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానంటూ.. 2021లో నారా చంద్రబాబు చేసిన శపథం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అదేసమయంలో 2019 ఎన్నికల్లో అప్రతిహత టీడీపీ ప్రభంజనాన్ని వైసీపీ కేవలం 23 స్థానాలకు పరిమితం చేసింది. అంతేకాదు.. నలుగురు ఎమ్మెల్యేలను కూడా పార్టీకి దూరం చేసి.. టీడీపీకి ఉనికికే సవాల్ మారిన వైసీపీకి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం పార్టీ నాయకులపైనే ఉంది.
పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు.. తనవంతు ప్రయత్నాన్ని ఎక్కడా విస్మరించలేదు. విస్మరించడమూ లేదు. 70 ఏళ్లు దాటిన వయసులో కూడా ఆయన ఎంతో చలాకీగా పార్టీకోసం.. పనిచేస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎప్పటికప్పుడు.. ఏదో ఒక కార్యక్రమాన్ని తెరమీదికి తీసుకువస్తున్నారు. నవనవోన్మేషంగా పార్టీని ముందుకు నడిస్తున్నారు. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వంపై ప్రత్యక్ష ఉద్యమాలు.. నిరసనలు.. ప్రజల తరఫున బాణీ వినిస్తున్నారు. అంటే ఒకరకంగా.. పార్టీలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజం నింపుతూనే ఉన్నారు.
మరి.. అధినేత చంద్రబాబు ఇలా చేస్తుంటే.. నాయకులుగా, కార్యకర్తలు.. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న ఎన్నారై కార్యకర్తలు కానీ.. ఏం చేయాలి? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన ప్రశ్న. తాజాగా అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం సమావేశం(తానా)లో టీడీపీలో వర్గ విభేదాలు పొడచూపాయి. నారా లోకేష్ వర్గం.. నందమూరి తారక్ వర్గంగా ఏర్పడి ఒకరిపై ఒకరు కుమ్ములాడుకున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టదనే విధంగా వారు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఏమో తెలియదు కానీ.. రోడ్డున పడుతున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా.. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న చంద్రబాబు వ్యూహానికి తమ్ముళ్లు ఏమేరకు సహకరిస్తున్నట్టు? అనేది ప్రధాన ప్రశ్న.
టీడీపీకి ఇప్పుడు కావాల్సింది.. వర్గ విభేదాలు.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలా? అంటే కానేకాదనే సమాధానం వస్తోంది. ఇప్పుడు పార్టీకి కావాల్సింది ఐక్యత! వైసీపీ వంటి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ విదుల్చుతున్న అనేక సవాళ్లను తట్టుకుని.. పార్టీని అప్రతిహతంగా ముందుకు తీసుకువెళ్లడంతో ఏ పార్టీ అయితే.. టీడీపీ ఉనికిని ప్రశ్నించేలా వ్యవహరించిందో .. అదే వైసీపీకి తగిన విధంగా గుణ పాఠం చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తపైనా ఉంది. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన పార్టీలో అదే ఆత్మగౌరాన్ని ఇప్పుడు ప్రదర్శించాల్సిన అగత్యం..అవసరం కూడా ఏర్పడిందని గుర్తించాల్సిన తరుణం వచ్చింది.
ఈ క్రమంలో నందమూరి, నారా కుటుంబాల పేర్లు చెప్పి విభేదాలతో కాలం గడపడం.. వేదికలపై తన్నుకోవడం వల్ల.. పార్టీని మరింత పలుచ న చేసుకోవడం మినహా కార్యకర్తలు, నాయకులు సాధించేది ఏమీ ఉండదని పరిశీలకులు చెబుతున్న మాట. నందమూరి కుటుంబం నుంచి పార్టీ పుట్టినా..నారా కుటుంబంతో ఆ పార్టీ మరింత పరిఢవిల్లిందనే నిజానికి తమ్ముళ్లు గుర్తించాలి. ఏదేశమేగినా.. ఎందు కాలిడినా.. అన్నట్టుగా.. తమ్ముళ్లు ఎక్కడున్నా.. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు, నారా లోకేష్, అదేసమయంలో నందమూరి బాలయ్య, నందమూరి తారక్.. ఈ నలుగురి అభిమానులు కలిసి కట్టుగా N-4 మంత్రాన్ని పఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు టీడీపీని పరిమితం చేసిన వైసీపీపై అదేరేంజ్లో కసి తీర్చుకోవాలన్నా.. పార్టీ అధినేత చంద్రబాబు ఈ వయసులోనూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ.. పార్టీని అభివృద్ధి చేయాలని కలలు గంటున్న ఆయనకు సహకరించాలన్నా.. నిండు అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలన్న పూనిక ఉన్నా.. నారా అభిమానులు, నందమూరి అభిమానులుగా విడిపోవడం వల్ల సాధించేది ఏమీ ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం.. అన్న ఆర్యోక్తిని అనుసరించి.. కార్యకర్తలు, నాయకులు.. పార్టీని అభిమానించే వారు వ్యక్తులుగా విడిపోవడం మానేసి.. వ్యవస్థగా కలిసి పనిచేయాలన్నదే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకే నినాదం.. జై బాలయ్య, జై తారక్, జై చంద్రబాబు, జై లోకేష్.. ఒకే మంత్రం N-4 జిందాబాద్ను అనుసరించి.. సమష్టిగా ముందుకు కదిలిన నాడే టీడీపీ పుంజుకుని.. ఎక్కడైతే అవమానం జరిగిందో.. ఎక్కడైతే.. పార్టీ ప్రగతికి విచ్ఛిన్నకర శక్తుల నుంచి అడ్డుగోడలు ఏర్పడ్డాయో.. అక్కడ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది.. అక్కడే పార్టీ విజయఢంకా మోగించి.. నవనవోన్మేషంగా ముందుకు సాగుతుందనే కీలక సూత్రాన్ని తమ్ముళ్లు, కార్యకర్తలు గుర్తించి.. ఆదిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.