నెల్లూరులో ఈ సారి వైసీపీ సీన్ ఫుల్ రివ‌ర్స్‌.. టాప్ లేపుతూ టీడీపీ గెలిచే సీట్లు ఇవే..!

నెల్లూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా 6 నుంచి 7 స్థానాల్లో విజ‌యం త‌మ‌దేన‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల కాలంలో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణ‌మేన‌ని అంటు న్నారు. నిజానికి 2014 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే, 2019 విష‌యానికి వ‌చ్చేస‌రికి టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డా ఒక్క‌సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది.

ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అంతా కూడా వైసీపీకి ద‌న్నుగా నిలిచింది. దీంతో లెక్క‌లు మారిపోయి.. టీడీపీ నుంచి పోటీ చేసిన బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఓట‌మి బాట ప‌ట్టారు. అయితే.. ఇప్పుడు అవే లెక్క‌లు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వంటి వారు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీతో చేతులు క‌ల‌ప‌డం.. అదేవి|ధంగా మేక‌పాటి కుటుంబం నుంచి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి బ‌య‌ట‌కు రావ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది.

దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఖ‌చ్చితంగా ఆరు నుంచి 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం త‌మ‌దేన‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. వీటిలో ఆత్మ‌కూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూర‌ల్‌, ఉద‌య‌గిరి, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలైన కొవ్వూరు, గూడూరు, సూల్లూరుపేట‌ వంటి వాటిలో కొంత శ్ర‌మిస్తే.. విజ‌యం ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఇదంతా కూడా నాయ‌కులు అటు ఇటు మారిన ఫ‌లితంగా వ‌స్తున్న రిజల్ట్‌గా వారు పేర్కొంటున్నారు.

ఇదిలావుంటే, యువ‌గ‌ళం పాద‌యాత్ర ఎఫెక్ట్ పైనా నాయ‌కులు అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఇది కూడా ప్ర‌జ‌ల్లో బాగానే చేరింద‌ని గ్రామీణ స్తాయిలో టీడీపీ మేనిఫెస్టోపై బాగానే చ‌ర్చ సాగుతోంద‌ని.. ముఖ్యంగా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నార‌ని.. ప్ర‌తి కుటుంబంలోనూ ఎంత మంది పిల్లలు ఉంటే అంత‌మందికీ 15000 చొప్పున ఇస్తామ‌న్న దానిపై చ‌ర్చ సాగుతోంద‌ని.. దీనిని బ‌ట్టి గ్రామీణ ఓటు బ్యాంకు కూడా త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా నెల్లూరులో ఈ ద‌ఫా మెజారిటీ స్థానాల‌ను తాము కైవ‌సం చేసుకుంటామ‌ని చెబుతున్నారు.