నెల్లూరులో బ్రేకుల్లేని సైకిల్‌… రివ‌ర్స్‌లో స్పీడ్‌గా తిరుగుతోన్న ఫ్యాన్‌..!

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుంది. భారీ ఎత్తున నాయ‌కుల చేరిక‌ల‌తో పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంద‌నిసీనియ‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. “నిజానికి.. ఇంత మార్పు వ‌స్తుంద‌ని మేం ఊహించ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా మేం ఇక్క‌డ మెజారిటీ స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటాం“ అని నెల్లూరు బాధ్య‌త‌లు చూస్తున్న కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. నెల్లూరు జిల్లాలో 5 నుంచి 6 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం త‌మ‌దేన‌ని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వంటి సీనియ‌ర్ నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వంటివారు పార్టీలో చేర‌డంతో పుంజుకుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. అదేస‌మ‌యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర ఎఫెక్ట్ కూడా బాగానే ఉంద‌ని క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. అంద‌రూ కూడా పాత‌కాపులే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఆనం, మేక‌పాటి, కోటంరెడ్డి వంటివారు.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తొ విజ‌యం ద‌క్కించుకున్నార‌నే టాక్ ఉంది. వీరికిప్ర‌త్యేకంగా.. జ‌గ‌న్ సానుభూతి కానీ.. ఆయ‌న పాద‌యాత్ర తాలూకు ఎఫెక్ట్ కానీ ప‌నిచేయ‌లేదు. కేవ‌లం వారి సొంత ఇమేజ్‌.. గ‌తంలో చేసిన ప‌నులు.. ప్ర‌జ‌ల్లో ఉన్న పేరుతో వారు విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ నేప‌థ్యానికి తోడు టీడీపీలోనూ బ‌ల‌మైన నాయ‌కులు కురుగుండ్ల రామ‌కృష్ణ‌, బీద ర‌విచంద్ర‌యాద‌వ్ వంటివారు ఉన్నారు. అదేవిధంగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వంటివారు విజ‌యం ద‌క్కించుకోక పోయినా.. ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంది. అదేవిధంగానాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయి. ఇలా.. మొత్తంగా ఈ సారి.. వైసీపీని డామినేట్ చేసే యంత్రాంగం టీడీపీలో బ‌ల‌ప‌డింద‌నే వాద‌న క్షేత్ర‌స్థాయిలోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.