నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, వైజాగ్ గీతం విద్యా సంస్థల అధినేత మెతుకుమిల్లి శ్రె భరత్ గత సాధారణ ఎన్నికల్లోనే రాజకీయారంగ్రేటం చేశాడు. తాత దివంగత ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ అడుగు జాడల్లో నడుస్తూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ చేతుల్లో కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినా కూడా భరత్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో రాజకీయంగా యాక్టివ్గానే ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సారి కూడా భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు భరత్ చూపు మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భరత్ అటు విశాఖ ఎంపీ సీటు మీద ఆలోచిస్తూనే మరో వైపు భీమునిపట్నం అసెంబ్లీ సీటు మీద కర్చీఫ్ వేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భీమిలి టీడీపీకి కంచుకోట. అసలు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి 2004 వరకు కూడా అసలు భీమిలిలో టీడీపీ ఓడిపోలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరి కరోనాతో మృతిచెందారు. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఇన్చార్జ్గా కోరాడ రాజబాబు ఉన్నా కూడా ఆయన అక్కడ బలమైన క్యాండెడ్ కారని చెపుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలన్న మక్కువతో ఉన్న శ్రీ భరత్ భీమునిపట్నం నుంచి పోటీ చేసే ప్లాన్తో ఉన్నారట. మరోవైపు ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారే గంటా కూడా ఈ సారి విశాఖ నార్త్ నుంచి భీమిలి వైపు మారాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా ఇదే సీటును జనసేన కూడా కోరే ఆలోచనలో ఉందంటున్నారు. మరి బాలయ్య చిన్నల్లుడు అసెంబ్లీ కోరిక నెరవేరుతుందా ? లేదా ? అన్నది చూడాలి.