ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైన్ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ పోలీసులు ఎప్పుడు ? అరెస్టు చేస్తారా అన్న ఆందోళనతో ఆ పార్టీ మొత్తం ఉంది. చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని ఒప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో జగన్ సోదరి వైఎస్ షర్మిల తన అన్న పార్టీకి.. అన్నకు పెద్ద షాక్ ఇచ్చారు. వివేక హత్యకు సంబంధించి వైసిపి గత కొంతకాలంగా చేస్తున్న వాదనలు అన్ని అవాస్తవం అంటూ ఆమె కామెంట్ చేశారు.
షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆస్తి కోసం తండ్రిని సునీత, ఆమె భర్త చంపించారు అనటంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. సునీత పేరుపై ఏనాడో ఆస్తులను బదిలాయించింది వివేకానంద రెడ్డి అని అన్నారు. చిన్నాన్న, చిన్నమ్మల పేర్లపై ఆస్తులు ఏమీ లేవని.. ఒకవేళ ఒకటో అరో వివేక పేరుపై ఆస్తులు ఉంటే అవి తదనంతరం సునీత పిల్లలకు చెందేలా వీలునామా తన చిన్నాన్న రాయించారని షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు.
ఆస్తి కోసమే అయితే వివేకాను కాకుండా సునీతను ఆమె భర్త చంపి ఉండాల్సిందని సంచలన కామెంట్ చేశారు. వివేక వ్యక్తిగత జీవితాన్ని కించపరిచే ప్రచారం చేయడంపై షర్మిల ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడు అయిన చిన్నాన్న గురించి తమ కంటే పులివెందుల, కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసని.. చిన్న సమస్య వచ్చిన వారిని వెంటబెట్టుకుని కలెక్టర్ ఆఫీస్ కి అయినా.. చిన్న పంచాయతీ కార్యాలయం కైనా తనే స్వయంగా వెళ్లేవారని షర్మిల చెప్పారు.
ఇదిలా ఉంటే షర్మిల విమర్శలు అన్ని వైసిపి నేతలతో పాటు సాక్షి మీడియా సంస్థలను దృష్టిలో పెట్టుకుని… జగన్ను ఇరుకున పెట్టేలా చేసినట్టుగా ఉన్నాయి. సాక్షిలో ఈనెల 22న ఫస్ట్ పేజీలో వివేకపై కక్షగట్టింది ఆ ఇద్దరి అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనంలో వివేకా తన రెండో భార్య, కుమారుడితో ఉన్నట్టు సాక్షి పత్రిక ఓ ఫొటోను కూడా వేసింది. వివేకా హత్యతో అవినాష్రెడ్డికి సంబంధం లేదని చెప్పే క్రమంలో వైసీపీ కౌంటర్లకు ఘాటుగా షర్మిల కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు వైసీపీ, జగన్ను ఇరుకున పెట్టేలా ఉంది.