మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు అయ్యింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వగా వాటిని సిజెఐ ధర్మాసనం కొట్టివేసింది. దీంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కి సిబిఐ కి లైన్ క్లియర్ అయినట్లయ్యింది.
వివేకా కుమార్తె సునీత పిటీషన్ పై సుదీర్ఘమైన తీర్పును ఇచ్చిన సిజెఐ ధర్మాసనం… చాలా విషయాలను సూటిగా చెప్పింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని కూడా సిజెఐ ధర్మాసనం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వివేకా కుమార్తె సునీతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సిజెఐ ధర్మాసనం.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని కూడా సిజెఐ ధర్మాసనం అభిప్రాయ పడింది. ఏదిఏమైనా వివేకా కుమార్తె పట్టువదలని విక్రమార్కురాలిలా పోరాటం చేసి మరీ ఈ కేసులో పై చేయి సాధించారనే చెప్పాలి. అసలు అవినాష్ను అరెస్టు చేసేందుకు సీబీఐ రెడీ అవుతోన్న టైంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మరీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆ బెయిల్ను ఏకంగా సుప్రీంకోర్టు కొట్టేయడంతో అవినాష్ను అరెస్ట్ చేయకూడదు అనే నిబంధనలేవీ లేవు. దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ లాంఛనమేననే వాదనలు వినపడుతున్నాయి. సీబీఐ రేపు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిస్తే తీవ్రమైన ఉత్కంఠ మొదలైనట్టే..!