సినిమాల రెమ్యునరేషన్ విషయంలో అన్నగారు రాజీపడేవారు కాదు. నిర్మాత పెద్దవాడా? చిన్నవాడా? అనే తేడా లేకుండా..అందరి దగ్గరా తొలినాళ్లలో సమానంగానే తీసుకున్నారు. ఈ విషయంలో చాలా కరెక్ట్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక, తానునటించిన సినిమాను దైవంగా భావించేవారు. సమయానికి షూటింగ్ స్పాట్కు వెళ్లడం, నిర్మాత, దర్శకులకు.. ప్రాధాన్యం ఇవ్వడం తోటి ఆర్టిస్టులతో చలోక్తులు విసురుతూ.. ముందుకు సాగడం వంటివి అన్నగారికి బాగా కలిసి వచ్చాయి.
ఈ తరహా పరిణామం అన్నగారిని ఉన్నతస్థాయికి చేర్చింది. తొలినాళ్లలో భరణీ పిక్చర్స్ సంస్థ..(దీనిని మహానటి భానుమతి ఆమె భర్త రామకృష్ణలు ఏర్పాటు చేసుకున్నారు సినిమాల్లో నటించేవారికి జీతాలు ఏం సరిపోతాయి.. అంటూ.. రెమ్యునరేషన్ విధానాన్ని తీసుకువచ్చాయి. అంటే.. ఒకరకంగా కాంట్రాక్ట్ అన్నమాట. సినిమా అయిపోయినతర్వాత.. నటులకు, నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు.
లాభ నష్టాలతోనూ వారికి సంబంధం లేదు. ఇలానే ఒప్పందాలు చేసుకునేవారు. అయితే, ఎన్టీఆర్తో తీసిన అనేక సినిమాలకు రామకృష్ణ ఒప్పందం చేసుకోలేదు. దీనికి కారణం.. ఆయనను ఇంటి మనిషిగా చూసుకున్నారు. అయితే.. భరణి పిక్చర్స్ పతాకంలో తీసిన ఒక సినిమా ఫెయిల్ అయింది. దీంతో అన్నగారికి ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అప్పటికి సంస్థ కూడా కొంత కష్టాల్లో ఉంది.
కానీ, ఎన్టీఆర్ మాత్రం తన రెమ్యునరేషన్ కోసం.. ఆఫీసుకు వెళ్లారు. అక్కడే భానుమతి-రామకృష్ణ ఇద్దరూ ఉన్నారు. అయితే, వారి దగ్గర అన్నగారికి ఇస్తామన్న లక్ష రూపాయల్లో కేవలం 90 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ మొత్తాన్ని ఇచ్చేసి 10 వేల కోసం ఆగమన్నారు. కానీ, భానుమతి మాత్రం తర్వాత చూద్దాంలే అనే సరికి అన్నగారు ఒప్పుకోలేదు. ఇది .. తర్వాత తర్వాత.. సినిమాలకు వారిని దూరం చేసిందని అంటారు. ఆ పది వేలు ఎప్పుడో ఇచ్చారని..భానుమతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.