హైదరాబాద్ అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్లపై కొర‌డా…!

ప్ర‌స్తుతం మాన‌వాళిని మాన‌సికంగా దెబ్బ‌కొడుతోన్న వాటిల్లో అటిజం ఒక‌టి. చిన్నారుల భ‌విష్య‌త్తును చాప‌కింద నీరులా నాశ‌నం చేస్తూ వారి కుటుంబాల‌ను అన్ని విధాలా దెబ్బ‌కొడుతోంది. అటిజం పిల్ల‌ల‌కు ఉన్న ఒకే ఒక మార్గం థెర‌పీ స‌ర్వీసులు. హైదరాబాద్ మహానగరంలో పుట్ట‌గొడుగుల్లా ఈ థెర‌పీ స‌ర్వీసు సెంట‌ర్లు పెట్టుకు వ‌చ్చాయి.

అయితే ఇందులో చాలా సెంట‌ర్ల‌కు రిజిస్ట్రేష‌న్లు లేవు.. స‌రైన నిపుణులు లేరు.. స‌రైన బిల్డింగులు, సౌక‌ర్యాలు కూడా లేవు. కేవ‌లం ధ‌నార్జ‌నే ల‌క్ష్యంగా కొన్ని న‌కిలీ సెంట‌ర్లు ఏర్పాటు చేసి న‌కిలీ థెర‌పీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త రెండు మూడు రోజులుగా న‌గ‌రంలో కూక‌ట్‌ప‌ల్లి, సుచిత్ర‌, బీకే గూడా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తోన్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

చిన్న పిల్లలలో సెన్సోరియల్ సమస్యల‌తో పాటు… ఎదుగుదల లోపాలు, మానసిక రుగ్మతల ఇబ్బందులకు శాస్త్రీయ పద్దతిలో మాత్రమే థెరపిస్ ఇవాలి. ఈ విష‌యాల‌పై ఇప్ప‌టికే చాలా మంది నిపుణులు అనేక సూచ‌న‌ల‌తో పాటు హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. అయినా వాటిని సెంట‌ర్లు పెడ‌చెవిన పెట్టేస్తున్నాయి. వాస్త‌వంగా Sec – 52 RPWD Act 2016, ప్రకారం సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

పై చ‌ట్టంలో ఉన్న నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ థెర‌పీ సెంట‌ర్లు ఏర్పాటు చేయాలి.. అలాగే థెర‌పీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వీటిపై అవ‌గాహ‌న లేకుండా థెరపిస్ అనే పేరుతో చిన్నపిల్లల భవిష్యత్తుపై ప్ర‌భావం చూపేలా న‌కిలీ ఆట‌లు ఆడుతున్నారు. ఇప్ప‌ట‌కి అయినా న‌గ‌రంలో కుప్ప‌లు తెప్ప‌లుగా పుట్టుకు వ‌స్తోన్న ఈ అక్రమ సెంటర్ లపై సరిఅయిన చర్యలు తీసుకోవాలి అని నిపుణలు, తల్లిదండ్రుల కోరికల మేరకు అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం.