గంధపు చెక్కల స్మగ్లర్కు.. తెలుగు సినిమాలకు సంబంధం ఉందా? అసలు సినీ ఇండస్ట్రీతో వీరప్పన్కు ఉన్న సంబంధం ఏంటి? అనేది కొన్నాళ్ల పాటుదేశవ్యాప్తంగా చర్చ సాగింది. అప్పట్లో అంటే.. 1980లలో వీరప్పన్ అంటే హడల్. సమాంతర ప్రభుత్వాన్ని ఆయన నడిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా చుక్కలు చూపించారు. అధికారులకు దడపుట్టించారు.
దీంతో అప్పట్లో తెలుగు సినిమాల్లో మంచి ఫామ్లో ఉన్న మాదాల రంగారావు (దర్శకుడు, నిర్మాత, హీరో) వీరప్పన్ సెంట్రిక్గా సినిమా చేయాలని అనుకున్నారు. దీంతో ఆయనకు ఉన్న పరిచయాలతో వీరప్పన్తో ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. కానీ, వీరప్పన్ ఈ విషయం తెలుసుకుని.. పత్రికా ప్రకటన ఇచ్చారు. “నా గురించి ఎవరో సినిమా తీయాలని చూస్తున్నారు.
వారికి సినిమా చూపిస్తా“ అని రెండే వాక్యాల్లో ముగించారు. కానీ, మాదాల రంగారావు ఈ ప్రయత్నం మాత్రం విరమించలేదు. దీంతో తమిళ, కన్నడ పరిశ్రమపై వీరప్పన్ ఒత్తిడి తెచ్చారు. తన వారితో యాగీ చేయించారు. దర్శకులకు వార్నింగ్లు ఇప్పించారు. ఈ నేపథ్యంలో కన్నడ, తమిళ సినీ రంగాలకు చెందిన పెద్దలు.. తెలుగు ఇండస్ట్రీతో మాట్లాడి.. మాదల రంగారావుకు నచ్చజెప్పారట. దీంతో వీరప్పన్ జీవితంపై సినిమా తీయాలని అనుకున్న మాదాల వెనక్కి తగ్గారు.
అప్పట్లో అనేక సమస్యలపై మాదల సినిమాలు చేసేవారు. ముఖ్యంగా మావోయిస్టుల సానుభూతి కోణాన్ని ఆయన ఎక్కువగా చూపించారు. ఒకానొక దశలో ఆయన తీసిన ఎర్రమల్లెలు సినిమాపై ప్రభుత్వం నిషేధం విధించాలని చూడడం గమనార్హం. కట్ చేస్తే.. వీరప్పన్ మరణం తర్వాత.. ఆయన గురించి వర్మ సినిమా తీయడం గమనార్హం.