సినిమా ఇండస్ట్రీ అంటేనే.. మాయా ప్రపంచం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. సినిమా కథలే కాదు.. నిజ జీవిత కథలు కూడా.. గందరగోళంగా మారి.. జీవితాలు ఫ్లాప్ అయిన హీరోలు.. హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో రాజసులోచన ఒకరు. ఈమె గురించి ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పుడు సావిత్రి, భానుమతి వంటివారికి గట్టిపోటీ ఇచ్చారు.
నటనలోనే కాదు.. నాట్యం, గాత్రం ఇలా.. రెండు మూడు విభాగాల్లో తనకంటూ.. ప్రత్యేకతను చాటుకున్న రాజసులోచన.. తెలుగు తెరపై.. అప్పటి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నారు. అయితే, నిజ జీవితంలో మాత్రం ఆమె విఫలమయ్యారు. మహానటి సావిత్రితో అత్యంత చనువుగా ఉండడమే కాదు.. సావిత్రి ప్రోత్సాహంతో డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహించారు. భారతీయ నాట్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు.
అప్పటి నృత్య దర్శకులు.. పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి సినిమాల్లోనే కాకుండా.. బయట కూడా అనేక వేదికలపై రాజసులోచన డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చారు. ఇలాంటి ఆమె.. నిజ జీవితానికి వచ్చే సరికి.. మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నా.. తర్వాత తర్వాత.. అనూహ్యమైన మలుపులు తిరిగాయి. ప్రేమించి చేసుకున్న పెళ్లి.. ఒక బిడ్డ పుట్టిన తర్వాత.. విడాకులకు దారి తీసింది. తర్వాత.. దర్శకుడు సీఎస్ రావుకు చేరువయ్యారు. సీఎస్ రావు దర్శకత్వంలోనే రాజసులోచన అనేక సినిమాల్లో నటించారు.
ఇద్దరూ కూడా చాలా చనువుగా కూడా ఉండేవారు. ఈ పరిచయమే.. వారిని పెళ్లి బంధంవైపు నడిపించింది. అయితే.. అప్పటికే రావుకు కూడా.. పెళ్లి కావడమే కాదు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా.. రాజసులోచన ఇష్టపడి ఆయనను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు. అయితే.. తర్వాత ఇంత ప్రేమించుకున్న వీరి మధ్య కూడా విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. చివరకు ఒంటరిగానే రాజ సులోచన కన్ను మూశారు. తనకు వివాహాలు కలిసి రాలేదని ఆమె పేర్కొనడం గమనార్హం.