సాధారణంగా రాజకీయాలు అంటే.. నాయకులను తిట్టేవాడు.. అదేసమయంలో పొగిడేవాడు.. ఇద్దరూ ఉం టారు. ఎంతసేపూ.. పొగిడినా.. ఏదో అనుమానం ఉన్నట్టేనని ప్రజలు లెక్కలు వేసుకుంటారు. అసలు విమర్శలు.. అనేవి రాజకీయ నాయకులకు కొలబద్దలు.. సరిచేసుకునే మార్గాలు అనేవారు.. గతంలో ఉన్న నాయకులు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. “అంతా బాగుంది. అంతా వెలిగిపోతోంది“ అని భజన చేసేవారు మాత్రమే నాయకులకు నచ్చుతున్నారు.
ఇక, ఈ పరంపరలో ప్రతిపక్షాలకు అధికార పక్షం నాయకులు కల్పిస్తున్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్షాల కార్యక్రమాలకు అడ్డుతగలడం, వారు ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే.. దీనికి ముందే.. మరో కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం వంటివి అధికారపార్టీ నేతలకు ఆలవాలంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, కమ్ మంత్రి సీదిరి అప్పలరాజు విషయం కూడా ఇలానే ఉందన్న చర్చలు జిల్లా, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.
పలాస నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా ఉంది. పార్టీ ఇంచార్జ్.. గౌతు శిరీష ఇటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కూడా ఆమె హాజరవుతూ.. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటు లోనూ ఉంటున్నారు. దీంతో సహజంగానే ప్రజల దృష్టి అంతా కూడా.. ఆమెపైనే ఉంది. ఈ పరిణామాలతో మంత్రి సీదిరి ఉలిక్కి పడుతున్నారనేది టీడీపీ నేతల మాట.
ప్రజల్లో గౌతు శిరీషకు సానుభూతి పెరుగుతోందని, దీనిని చూసి సీదిరి తట్టుకోలేక పోతున్నారని.. అందుకే తమ కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని.. అడ్డంకులు సృష్టిస్తున్నారని, పోలీసులను రంగంలోకి దింపుతున్నారన్న విమర్శలు అయితే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే.. ఔను.. సీదిరి విపక్ష నేతకు భయపడుతున్నారనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. ఆయనకు చలీజ్వరం పట్టుకుందని కూడా.. కొందరు చెబుతున్నారు.
1) పార్టీ చేరికలు: పలాస మునిసిపాలిటీ పరిధిలోని తాళ్లభద్రలో టీడీపీలో చేరిక కార్యక్రమాన్ని గౌతు శిరీష చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే.. మంత్రి సీదిరి ఆదేశాలతో మూడు కంపెనీల పోలీసులు.. రంగంలోకి దిగి.. పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అంతేకాదు.. ఈ కార్యక్రమానికి అనుమతుల కోసం అర్ధరాత్రి వరకు గౌతు శిరీషను స్టేషన్లోనే కూర్చోబెట్టడంతో స్థానికంగా.. ప్రజలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసి.. ఆమెకు మద్దతు గా నిలబడ్డారు. వాస్తవానికి ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఉండకపోతే.. వార్డు కార్యక్రమం అయిపోయి ఉండేది. కానీ, మంత్రి జోక్యంతో దీనిపై నియోజకవర్గం సహా జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. గౌతు గ్రాఫ్ పెంచేసింది.
2) యువగళానికి మద్దతు: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రపు కొత్తూరు మండలం 13వ హరిపురంలో గౌతు శిరీష ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. అయితే.. దీనిని అడ్డుకునేందుకు మంత్రి ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఏర్పాటు చేసి.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ప్రజల నుంచి గౌతుకు మద్దతు లభించింది. మంత్రి వేసిన ఎత్తు ఇక్కడ చిత్తయ్యిందని టీడీపీ వాళ్లు చెపుతున్నారు.
3) గిరిజన సాధికార సమితి కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. గౌతు శిరీషకు పోటీగా మంత్రి సీదిరి కూడా గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు లేనిది.. అప్పుడు పట్టాలు పంచే కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదం అయ్యింది.
4) మందసలో గౌతు శిరీష టీడీపీ బస్సు భరోసా యాత్ర చేపట్టగా.. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో మంత్రి సీదిరి ఇక్కడకూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. వైసీపీలో ఉన్న సీదిరి వ్యతిరేక వర్గం .. వీటిని తీవ్రంగా వ్యతిరేకించడంతో.. వాళ్లలో వాళ్లే రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అంటే.. గౌతును రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన మంత్రి సీదిరికి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టయింది.
5) చీప్ ట్రిక్స్: సహజంగానే ప్రతిపక్షాలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏవో కార్యక్రమాలు చేపడతాయి. అయితే.. సీదిరి అప్పలరాజు మాత్రం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. టీడీపీ నాయకురాలు గౌతు ఏ కార్యక్రమం చేపట్టినా.. పోటీగా ఉదయాన్నే.. అదే ప్లేస్లో మరో కార్యక్రమం చేపట్టడం.. వీరి వేదికలు నిర్మించుకోకుండా అడ్డు చెప్పడం.. మంత్రి ప్రోటోకాల్ పేరుతో పోలీసులను రంగంలోకి దింపి అడ్డంకులు సృష్టించడం వంటివి రాజకీయంగానే కాకుండా.. సాధారణ ప్రజల మధ్య కూడా చర్చకు వస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. విపక్షం అంటే.. మంత్రి సీదిరికి చలీ జ్వరమా.. అనే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.