ఎన్టీఆర్ పొలిటీషియన్గా మారకముందే.. చాన్నాళ్ల క్రితం.. ఆయన నటించిన సినిమాల్లో పొలిటికల్ డైలాగులు ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వేదాంతం రాఘవయ్య తీసిన దేవదాస్ తర్వాత.. ఆయన జానపద సినిమాల వైపు మొగ్గుచూపారు. ఈ క్రమంలో ఆయన తీసిన భట్టి విక్రమార్క సినిమా బాగా ఆడింది. విజయవాడలో 100 రోజుల ఉత్సవం కూడా చేసి.. అన్నగారి కోరికమేరకు వేదాంతం రాఘవయ్యకు గజారోహణం కూడా నిర్వహించారు.
అయితే.. ఈ సినిమా పూర్తిగా జానపద బాణీలో చిత్రీకరించారు. కానీ, అప్పటికే తమిళనాడులో కొందరు సినీ నటులు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలంటే గిట్టని వేదాంతం రాఘవయ్య.. ఈ సినిమా ఆధారం చేసుకుని మంత్రులపై చురకలు అంటించారు. అదేసమయంలో సీఎం అనేవాడు.. బలంగా ఉండాలని.. ఏవో కొన్ని శక్తులపై ఆధారపడకూడదనే కోణంలోనూ ఈ సినిమాలో డైలాగులు రాయించారు.
వీటిని అన్నగారు బాగా ప్రోత్సహించారు. ఎందుకంటే.. అన్నగారికి కూడా రాజకీయాలంటే.. రాజకీయాలు గానే చూడాలనే భావన ఎక్కువగా ఉండేది. ప్రధాన పాత్రధాని విక్రమార్కుడిగా అన్నగారు ఎన్టీఆర్ నటించారు. భట్టిగా కత్తి కాంతారావు అద్భుతంగా నటించారు. అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో అప్పటి రాజకీయ పోకడలను అన్నగారి ద్వారా వేదాంతం వారు చెప్పించారు.
మంత్రులు అంటే.. ప్రజలకు సేవ చేయాలి కానీ.. రాజును పొగిడేందుకు.. రాజుకు సేవ చేసేందుకు కాదని చెప్పే డైలాగు.. ఇప్పటికీ రాజకీయాలకు, ప్రభుత్వాలకు అన్వయం అవుతుంది. అదేవిధంగా రాజు అనేవాడు స్వతః సిద్ధంగా బలవంతుడిగా ఉండాలి కానీ.. ఏవో శక్తులు ఆయనను రక్షిస్తాయని.. వాటి ద్వారా పాలన చేయాలనే ఆలోచన కూడదని అన్నగారు ఆ సినిమాలో అనేక సందర్భాల్లో చెబుతారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాలకు అన్వయం అవుతాయి. ఇలా.. అన్నగారి సినిమాల్లో భట్టి విక్రమార్క సినిమా డైలాగులు.. రాజకీయ చురకలు అంటించడం గమనార్హం.
ఆ తర్వాత.. చాన్నాళ్లకు అన్నగారు సినిమా రంగంలో గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన దాదాపు అదే పంథాను అనుసరించడం విశేషం. కుదిరితే భట్టి విక్రమార్క సినిమా చూడండి.. అన్నగారి డైలాగులు.. వేదాంతం రాఘవయ్య.. దర్శకత్వం మనల్ని కట్టి పడేస్తాయి. ఈ సినిమాను అంజలీదేవి (హీరోయిన్) స్వయంగా నిర్మించడం గమనార్హం. అప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.