టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలతో దూసుకు పోతున్నారు. ఈ క్రమంలోనే కుర్ర హీరో నిఖిల్ కూడా కార్తీకేయ 2 సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత నిఖిల్ క్రేజ్ బాగా పెరిగింది. ఈ క్రేజ్తోనే తర్వాత వచ్చిన 18 పేజెస్ సినిమా సైతం యావరేజ్ కంటెంట్తో హిట్ కొట్టింది.
ఈ క్రమంలోనే నిఖిల్ తాజాగా నటించిన సినిమా స్పై మూవీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా చూసిన జనాలు ట్విట్టర్తో పాటు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ రొటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా స్పై అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ స్పై సినిమాకు ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా… తమళ అమ్మాయి ఐశ్వర్య మీనన్ హీరోయిన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ తర్వాత ఆ ఫైల్స్ చుట్టూ తిరిగే ఈ కధ రొటీన్ కి భిన్నంగా ఉన్నా కూడా జనాలను ఆకట్టుకోలేక పోయిందంటున్నారు.
కథ బాగా రాసుకున్నా కూడా ఆ కథను జనాలకు అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ ప్లాప్ అయ్యాడనే అంటున్నారు. ఈ సినిమాలో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మినహా మిగిలిన నటీనటులు ఎవ్వరూ కూడా సినిమాకు ప్లస్ కాలేదంటున్నారు. ఇంటర్వెల్ లో మాత్రమే కాదు సినిమా మొత్తం మీద ఎక్కడా హైప్ ఇచ్చే సీన్లు లేవని.. విజిల్స్, అరుపులు పెట్టించే సీన్లతో పాటు క్యూరియాసిటీ పెంచే సీన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవనే అంటున్నారు.
ఓవరాల్గా నిఖిల్ ఓ మంచి కథ, అందులోనూ ఆసక్తికరమైన కథ ఎంచుకున్నా కూడా డైరెక్టర్ విషయంలో రాంగ్ స్టెప్ వేశాడని.. దీంతో ఓ మంచి కథను.. అందులోనూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథను చేజేతులా నాశనం చేసుకున్నాడనే అంటున్నారు.