నెద‌ర్లాండ్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రికెట‌ర్‌ ‘ తేజ నిడ‌మ‌నూరు’ మ‌న తెలుగోడే… బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ – 2023లో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరుగబోయే మెగా టోర్నీకి ముందు జింబాబ్వేలో నిర్వహిస్తున్న క్వాలిఫయర్ పోటీలలో ఇటీవలే వెస్టిండీస్ – నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఈ మ్యాచ్ ఫలితం ఓ చరిత్ర. వెస్టిండీస్ నిలిపిన 375 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ డ్రా చేయగలిగిందంటే దానికి కారణం తేజ నిడమనూరు.

భారీ లక్ష్య ఛేదనలో డచ్ టీమ్ 29 ఓవర్లలో 170 / 4 వద్ద ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన తేజ.. 76 బంతుల్లోనే 11 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను నెదర్లాండ్స్ వైపునకు తిప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈ విజయవాడ కుర్రాడి గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 1994 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు తేజ నిడమనూరు. చిన్నతనంలోనే ఇతడి కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్ కు వెళ్లిపోయారు.

అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటూ ఆక్లాండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకునీ.. న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో తేజకు జాబ్ రావడంతో ఇండియా టు వయా న్యూజిలాండ్ టు నెదర్లాండ్స్ వెళ్లిపోయాడు. ఉద్యోగం చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను కూడా మర్చిపోకూడదనే అనే ఉద్దేశంతో ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్‌ తరపున ఆడాడు. ఇలా డచ్‌ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న తేజాకు ఒక్కసారిగా ఆ దేశం తరుపున ఆడాల్సిందిగా పిలుపొచ్చింది.

నెదర్లాండ్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన తేజ. తర్వాత వన్డేల్లో కూడా అడుగుపెట్టి తొలి మ్యాచ్ లోనే అర్థ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో డచ్ టీం ఓడిపోయినప్పటికీ తేజ బ్యాటింగ్‌కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ తర్వాత జింబాబ్వే తో జరిగిన వన్డే మ్యాచ్లో 96 బంతుల్లో 110 పరుగులు చేశాడు. అంత‌కు ముందు కూడా తేజ ఓ సెంచ‌రీ చేశాడు.

ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తేజ నిడమనూరు పై కన్ను వేశాయి. అందరికంటే ముందుగా సన్రైజర్స్ టీం ఫ్రాంచైజీ కావ్య మారన్ ఐపీఎల్ వేలంలో తేజాను కొనుగోలు చేయాలని భావిస్తుందట. ఈ వార్త నిజమైతే మాత్రం తేజసుడి ఓ రేంజ్‌లో తిరిగినట్లే. మరి ఈ ఐపీఎల్ వేలంలో తేజాను ఏ టీం దక్కించుకుంటుందో చూడాలి.