నాగార్జున తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో నిన్నే పెళ్లాడతా సినిమా ఒకటి. నాగార్జున, టబు హీరో, హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ సీన్లు ఓ రేంజ్లో పండాయి. పాటలకు అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. కృష్ణవంశీ – నాగార్జున కాంబినేషన్లో నిన్నే పెళ్ళాడుతా లాంటి కూల్ టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుందని ఎవరు ?ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో సినిమాని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
రామ్గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకడైన కృష్ణవంశీ గులాబీ సినిమా తీసిన విధానాన్ని చూసి కృష్ణవంశీకి నాతో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. దీంతో ఒక మాస్ యాక్షన్ స్టోరీ సిద్ధం చేసుకుని నాగార్జునకి వినిపించాడు కృష్ణవంశీ. ఆ కథ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో లొకేషన్ చూడ్డానికి విశాఖపట్నం వెళ్లిన కృష్ణవంశీని ఓ వ్యక్తి చూసి గులాబీ సినిమాను చాలా బాగా తీశారు.. మీ గురువుగారు రాంగోపాల్ వర్మ లాగా మీరు కూడా చాలా బాగా చేశారంటూ ప్రశంసించాడట
దీంతో కృష్ణవంశీకి తాను యాక్షన్ మూవీస్ల్లో ఎంత మంచిగా సినిమాలు తీసిన వర్మ అనే ముద్రపోదని అర్థమయిపోయింది. దీంతో కృష్ణవంశీ వైజాగ్ నుంచే నాగార్జునకు ఫోన్ చేసి ఇంతకుముందు మీకు చెప్పిన కథను మనం సినిమా తీయడం లేదు అని అన్నాడట. వెంటనే నీకేమైనా పిచ్చి పట్టిందా అని నాగార్జున అడగడంతో పాటు ఫైర్ అయ్యాడట. ఇదంతా రేపు వచ్చి మీకు చెప్తాను అంటూ బదులిచ్చి ఫోన్ కట్ చేశాడట కృష్ణవంశీ. మరుసటి రోజు నాగార్జునను కలిసి నిన్నే పెళ్లాడతా కథ వినిపించాడట కృష్ణవంశీ.
అప్పటికే హిందీలో దిల్వాలే దునియా లేజాయేంగే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఇన్స్పిరేషన్తో నిన్నే పెళ్ళాడుతా కథని తయారు చేసిన కృష్ణవంశీ నాగార్జునకి వినిపించి ఓకే చేయించుకున్నాడు. తెలుగు నేటివిటీ, స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతలు కలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో 7 పాటలు ఉండగా 4 పాటలు సినిమాలోని పాత్రల పైనే షూటింగ్ జరుపుకున్నాయి. కేవలం 3 పాటలు మాత్రమే నాగార్జున – టబుల డ్యూయెట్ పాటలు కావడం విశేషం.