ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌… ఇప్ప‌టి నుంచి ఒక లెక్క‌… అదే ప్ర‌కాశం టీడీపీ లీడ‌ర్ల లెక్క‌…!

ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క… అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మాట ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో జనవరి 27న మొదలైన యాత్ర… అనంతరం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలను దాటి ప్రకాశం చేరుకుంది.

యాత్ర ఐదు జిల్లాలో సాగిన తీరు ఒకలా ఉంటే… ప్రకాశం జిల్లాలో మాత్రం మరోలా ఉంది. అనంతరం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పోల్చుకుంటే యాత్ర పట్టుమని పది రోజులు కూడా ప్రకాశం జిల్లాలో సాగలేదు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం వంటి ప్రధాన పట్టణాలకు దూరంగానే పాదయాత్ర చేశారు లోకేశ్. అయినా సరే… యాత్రకు వచ్చిన స్పందన చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే అన్నట్లుగా జిల్లా నేతలు ఏర్పాట్లు చేశారు.

ముందుగా కావలి నియోజకవర్గం నుంచి కందుకూరులోకి ప్రవేశించినప్పుడే… నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు భారీ ఫ్లెక్సీలతో జిల్లాలోకి స్వాగతం పలికారు. అక్కడ నుంచి కొండపి చేరుకునే సరికి… పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ నేత దామచర్ల సత్య కలిసి పాదయాత్రను నడిపించారు. కొండెపి నుంచి కనిగిరి చేరిన యాత్రకు ఉగ్ర నరసింహారెడ్డి కళ్లు చెదిరే ఏర్పాట్లు, జన సమీకరణ… కనిగిరి లో బహిరంగ సభ.. అప్పటికే ప్రకాశం పవర్ రాష్ట్రం మొత్తం తెలియడంతో… పలువురు రాష్ట్రస్థాయి నేతలు జిల్లాకు వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేత.. జిల్లాలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ అయితే… కనిగిరి లో సెల్ఫీ విత్ లోకేశ్ అంటూ వచ్చి షాక్ ఇచ్చారు. మార్కాపురం ఇంచార్జ్ కందుల నారాయణ రెడ్డి… వీల్ చైర్ తోనే పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో పొదిలి సభ సూపర్ హిట్. ఇవన్నీ ఒకెత్తు అయితే… ఒంగోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చేసిన ఏర్పాట్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. క్రేన్ లతో గజమాలలు, బాణాసంచా, ఒంగోలు నగరంలో పాదయాత్ర… జిల్లాకే హైలైట్ గా నిలిచింది.

ఇక సంతనూతలపాడు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయినా అక్క‌డ కూడా మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజ‌య్‌కుమార్ దుమ్ము లేపేశారు. సంత‌నూత‌ల‌పాడు పూర్తి చేసుకుని అద్దంకి చేరుకుంది యువగళం పాదయాత్ర. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 200 ట్రాక్టర్లతో పాదయాత్ర కు స్వాగతం పలికారు. అస‌లు అద్దంకి ఎంట్రీయే అదిరిపోయింది.

ఇక రేపు ప‌రుచూరు కూడా ఇదే రేంజ్‌లో ఉండ‌బోతోంది. అక్క‌డ ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావు ప్ర‌కాశం జిల్లా పాద‌యాత్ర‌లో ఆద్యంతం పాల్గొని స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. పైగా ఆయ‌న బాప‌ట్ల జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉండ‌డంతో ఆయ‌న త‌న జిల్లాలో మ‌రింత బాధ్య‌త తీసుకోనున్నారు. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో కూడా… జిల్లాలోని అందరు నేతలు పాల్గొన్నారు. పాదయాత్రకు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేలా కలిసికట్టుగా ప్లాన్ చేశారు.