తెలుగు సినీ రంగంలో తమకంటూ.. ప్రత్యేకతను చాటుకున్న జయప్రద, జయసుధల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూకూడా దాదాపు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు. అయితే.. మార్గాలు వేర్వేరు. జయప్రద సినీ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొంది రాగా.. జయసుధ మాత్రం.. పరిచయాల కారణంగా తెరమీదకు ఎక్కారు. అయితే.. తొలినాళ్లలో జయసుధకు హీరోయిన్ పాత్రలు దక్కలేదు. కేవలం చెల్లి.. సైడ్ ఆర్టిస్టు, అంధురాలైన బాలిక వంటి వేషాలే వచ్చాయి. దీంతో కొంత నిరాశకు గురైనా.. విజయనిర్మల ప్రోత్సాహంతో జయసుధ పుంజుకున్నారు.
ఇక, జయప్రద స్టార్టింగ్లోనే హీరోయిన్గా వచ్చారు. ఈమె అభినయం, ఆంగికం.. కళ్లు.. వంటివి బాపు, బాలచందర్ వంటివారిని ముగ్ధులను చేశాయి. దీంతో ఆమెకు పలు చిత్రాల్లో అవకాశం వచ్చేలా చేసింది. ముఖ్యంగా బాపు దర్శకత్వంలో వచ్చిన సీతాకళ్యాణం.. జయప్రదకు సూపర్పేరు తీసుకువచ్చింది. అయితే.. ఆ తర్వాత.. ఆమె మళ్లీ బాపు చిత్రాల్లో కంటే బాలచందర్ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు.
పైగా ఒకానొక దశలో సోలో పాత్రల్లోనే కనిపించరు. అంతులేని కథ సినిమా తొలిగా తమిళంలో తీశారు. దీనిలో జయప్రద సోలో పాత్ర. తర్వాత.. ఈ సినిమా తెలుగులోనూ తీశారు. ఇది సూపర్ డూపర్ హిట్టయింది. అయితే.. ఇద్దరూ కూడా వేర్వేరుగా రాణిస్తున్న సమయంలో అన్నగారు ఎన్టీఆర్ తీసిన అడవి రాముడు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అయి.. తొలుత జయప్రదను, శ్రీదేవిని సంప్రదించారు.
కానీ, శ్రీదేవికి కాల్షీట్లతో ప్రాబ్లం వచ్చింది. దీంతో జయసుధను తీసుకున్నారు. అప్పటికి కొన్ని ఫెయిల్యూర్స్ ఉండడంతో జయసుధ పోటా పోటీగా నటించింది. జయప్రద కూడా అన్నగారి సరసన రెచ్చిపోయి నటించింది. కానీ, క్రెడిట్ మాత్రం జయప్రద సొంతం చేసుకుంది. ఆ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి వార్లో మధ్యలో ఎన్టీఆర్ నలిగిపోయేవారట. దీంతో జయసుధ మళ్లీ వెనుకబడిపోయారు. ఇక, హీరో కృష్ణ, శోబన్ బాబు వంటి అగ్ర హీరోల సరసన కూడా ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి.
కొన్ని సినిమాల్లో జయసుధ పేరు తెచ్చుకోగా, కొన్నింటిలో జయప్రదకు మంచి మార్కులు పడ్డాయి. ఇద్దరూ కూడా స్నేహితురాళ్ల య్యారు. అయితే.. తర్వాత కాలంలో రాజకీయాల్లోకి జయప్రద ఎంట్రీ ఇవ్వడాన్ని జయసుధ తప్పుబట్టారు. ఇక్కడే వారికి విభేదాలు వచ్చాయని అంటారు. కానీ, జయసుధ కూడా తర్వాత కాలంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే.