ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడిపి ఊహించిన విధంగా ఘనవిజయం సాధించింది. టీడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి అందరికంటే ముందు తొలి విజయం సాధించారు. వైసిపి నుంచి ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు మరి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ చేయడంతో అనురాధ చాలా సులువుగా గెలిచారు. ఈ పరిణామం వైసిపి అసలు ఊహించలేదు. అసలు తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అని జగన్ కలలో కూడా ఊహించి ఉండరు.
ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వైసిపికి ఇది వరుసగా నాలుగో పరాభవం. అధికార పార్టీగా తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి.. ఈ ఫలితాలు నిజంగానే ఘోర అవమానం మిగిల్చాయి. జగన్ ప్రణాళికా వైఫల్యం.. చంద్రబాబు ఎత్తులను ఎదుర్కోవటంలో సరైన వ్యూహం లేకపోవడం స్పష్టంగా కనిపించాయి. మరో వైపు చంద్రబాబు తన అపర రాజకీయ చాణిక్యాన్ని మొత్తం ఉపయోగించి టీడిపిని గెలిపించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బాబు మాస్టర్ ప్లాన్ ముందు జగన్ అండ్ కో ఎత్తులు చిత్తు అయ్యాయి అని తాజా ఫలితాలు నిరూపించాయి. వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం పక్కా అని టీడిపి ముందు నుంచి చెప్తువచ్చింది. వైసిపి దానిని అంత సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఏదేమైనా స్ట్రాటజీలలో చంద్రబాబును ఢీకొట్టడం వైసిపి వల్ల కాదు అని మరోసారి తెలిసిపోయింది.
ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలలో విపరీతమైన అసంతృప్తి ఉందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా జగన్ దానిని లైట్ తీసుకున్నారు. ఇక తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అది బయటపడిపోయింది. ఇలా వైసిపిని జనం ఓట్లతో కాదు.. జగన్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలే ఓడించడంతో ఇప్పుడు జగన్ కూడా చాలా సీరియస్ గా ఆలోచించుకోవలసిన సమయం వచ్చేసింది. ఏదేమైనా వైసిపి ఎమ్మెల్యేల ఓటింగ్ తో టీడిపి గెలవడం అనేది టీడీపీకి అదిరిపోయే మజాలాంటి గెలుపును అందించినట్లు అయింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో మరికొందరు వైసిపి అసలు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.