ఏపీలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం చంద్రబాబు కెరీర్ కు ఎంతో కీలకం. చంద్రబాబుతో పాటు అటు ఆయన తనయుడు యువనేత లోకేష్ ఎంతో కష్టపడుతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు కూడా ప్రజల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సమయంలో కూడా టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఇన్చార్జిలు, సరైన అభ్యర్థులు లేని దుస్థితి నెలకొంది.
చంద్రబాబు ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఎన్నికల వేళ పార్టీలో గ్రూపుల గోల చెలరేగి పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు తప్పేలా లేవు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఇక్కడ పార్టీ గెలిచిన ప్రతిసారి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్ గా మారింది. 1983 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. 1994, 99 లో ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థి కొత్తపల్లి జయరాం విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంది.
1989లో కాంగ్రెస్ నుంచి శమంతకమణి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇక 1983, 1985లో తెలుగుదేశం ఇక్కడ గెలిచింది. అప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇక 2004 – 2009 ఎన్నికలలో వరుసగా మాజీ మంత్రి శైలజనాథ్ విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో టిడిపి నుంచి యామిని బాల విజయం సాధించారు.
అప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి ఏకంగా టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి పై 46 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు నియోజకవర్గంలో వైసిపిపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. బండారు శ్రావణితో పాటు పార్టీ ఎస్సీ సెల్ నేత ఎంఎస్. రాజు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. బండారు శ్రావణికి జేసీ ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి.
ప్రస్తుతానికి ఇక్కడ ఇన్చార్జ్ అంటూ ఎవ్వరూ లేరు. ఇలాంటి కంచుకోటలో అక్కడ పార్టీ పగ్గాలు ఎవరికో ఒకరికి ఇస్తే పార్టీ ఏకతాటిమీదకు వస్తుందని.. లేకపోతే గ్రూపుల గోలతో కొట్టుమిట్టాడుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఇప్పటకీ అయినా అక్కడ ఇన్చార్జ్ను నియమిస్తే పార్టీలో లుకలుకలు, గ్రూపుల గోలకు కొంత వరకు చెక్ పెట్టవచ్చు.