టీడీపీ దూకుడు పెరిగింది. రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్ దూకుడు పెంచారు. దీనికితోడు.. వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో వెలుగు చూసిన వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి కేసు వంటివాటిని టీడీపీ అందివచ్చిన ఆయుధాలుగా భావిస్తూ.. ముందుకుతీసుకువెళ్లింది. దీంతో వైసీపీ సహజంగానే డిఫెన్స్లో పడిపోయింది. ఈ రెండు కేసులను అడ్డు పెట్టుకుని గత ఎన్నికల్లో వైసీపీ సింపతీ తెచ్చుకుందని టీడీపీ చెబుతోంది.
అయితే.. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు.. ఆ రెండు అంశాలే.. ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారాయి. సొంత పార్టీ ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొనడం.. కోడికత్తి కేసులో టీడీపీకి ప్రమేయం లేదని.. అసలు కుట్రే లేదని ఎన్ ఐఏ సంస్థ తేల్చి చెప్పడంతో వైసీపీ సహజంగానే ఇరకాటంలో పడిపో యింది. ఇప్పుడు ఏం చేయాలనేది వైసీపీ అంతుచిక్కని విషయంగా మారిపోయింది. ఈ రెండు విషయాలను టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది.
దీంతో ఒకరకంగా వైసీపీలో భయం పట్టుకుందని టీడీపీ నేతలే చెబుతున్నారు. మరోవైపు.. పన్నుల బాదుడు, ధరల పెరుగుదలను కూడా.. టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. పొరుగు రాష్ట్రాలతో ఉన్న ధరలను పోలుస్తూ.. ఏపీలో వైసీపీ సర్కారు ఒక చేత్తో 100 ఇస్తూ.. మరో చేత్తో 1000 దోచేస్తోందని..టీడీపీ చెబుతున్న వాదన.. ప్రజల్లో నాటుకుంటోంది. ఇది వచ్చే ఏడాది నాటికి మరింత పెరుగుతుంది.
ఇక, దీనికితోడు అభివృద్ధి లేదనే విషయాన్ని కూడా టీడీపీ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి అభివృద్ధి.. ఇప్పుడు.. ఎలాంటి అభివృద్ధి లేకపోవడాన్ని పోలుస్తూ.. సోషల్ మీడియా సహా.. ప్రధాన మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం ముమ్మరం చేసింది. దీంతో వైసీపీకి దక్కిందని భావిస్తున్న సింపతీ తగ్గిపోతోంది. ఇది.. ఎన్నికల నాటికి మరింత ముమ్మరం అయితే.. ఇబ్బంది తప్పదని పార్టీ నాయకులు లెక్కులు వేస్తున్నారు.