ఏపీలో వచ్చే ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇటీవలే రాయలసీమలో యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. వైసీపీ చాలా బలంగా ఉన్న రాయలసీమ నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉరవకొండ, హిందూపురం, కుప్పం మినహా అన్ని చోట్లా వైసీపీ విజయం సాధించింది.
ఇది మామూలు కాదు.. అప్రతిహత విజయం అని చెప్పాలి. ఇక సీమలో ఉన్న 8 ఎంపీ సీట్లలో అన్ని చోట్లా వైసీపీ ఘన విజయాలు నమోదు చేసింది. సీమలో ఉన్న 8 ఎంపీ సీట్లలో అన్నీ సీట్లలోనూ వైసీపీకి గత ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్ల మెజార్టీ దక్కింది. అలాంటి ప్రాంతం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించడం నిజంగానే రాజకీయంగా ఓ సంచలనం అయ్యింది.
ఇక లోకేష్ పాదయాత్రకు సీఎం సొంత జిల్లా కడపలో అన్ని నియోజకవర్గాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యాక రాయలసీమలో సీఎం సొంత జిల్లా కడపతో పాటు అన్ని జిల్లాల్లోనూ టీడీపీకి అనుకూలంగా మారిందని పలు సర్వేలు చెపుతున్నాయి. టీవీ చర్చల్లో అమరావతి ఉద్యమనేత కొలికిపూడి శ్రీనివాసరావు సైతం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
లోకేష్ పాదయాత్ర తర్వాత ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం టీడీపీకి 34 సీట్లు వస్తాయని.. ఎన్నికల నాటికి ఈ సంఖ్య 40 – 44కు చేరుకోవచ్చని కూడా కొలికపూడి స్పష్టం చేశారు. జగన్కు చాలా నమ్మకంగా ఉండే ఓ అధికారి ఇచ్చిన సర్వే ఇది అని కూడా ఆయన తెలిపారు. రాయలసీమలోనే ఇదే పరిస్థితి ఉంటే ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు టీడీపీ క్వీన్స్వీప్ చేయవచ్చని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.