ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. పంజాబ్లోలా ఏపీలో కూడా అరాచకం రాజ్యమేలుతోందని కూడా మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల మోడీని తన కుటుంబంతో సహా కలిసి మాట్లాడారు. ఈ క్రమంలోనే మోడీ – కనకమేడల మధ్య ఏపీలో పాలన, శాంతి భద్రతలు లోపించడంతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు కనకమేడల స్పష్టం చేశారు.
ఏపీలో రోజురోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. మరో పంజాబ్లా మారిందన్న ప్రధాని వ్యాఖ్యలపై కనకమేడల స్పందిస్తూ 5 కోట్ల మంది ఏపీ ప్రజలను మీరే కాపాడలని కూడా చెప్పినట్టు తెలిసింది. ఏపీలో పాలన వ్యవహారాలు పూర్తిగా పడకేశాయని… ఏపీలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని మరీ పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.
గతంలో చంద్రబాబు కూడా ఏపీలో శాంతిభద్రతలు లోపించడంతో పాటు, అరాచక పాలన విషయాన్ని ఓ సారి తన వద్దకు తీసుకువచ్చారని.. ఏపీపై ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తనకు తెలుసు అని కూడా మోడీ అన్నారు. మోడీయే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సరైన టైం కోసం ఆయన వేచి చూస్తున్నట్టే అంటున్నారు. ఏదేమైనా శాంతి భద్రతల విషయంలో ఏపీ రోజు రోజుకు దిగజారుతూ వస్తోందని… ఇదే విషయం ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ కూడా స్పష్టం చేసినట్టు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.