టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహి్స్తున్న సభలకు.. భారీ ఎత్తున ప్రజలు పోటెత్తుతున్నారు. అది శ్రీకాకుళమా.. ఎర్రగొండపాలె మా..?అన్న తేడా లేకుండా.. నాయకులు పిలుపునివ్వడం.. ప్రజలు పోటెత్తడం కామన్గా జరిగిపోతోంది. ఇక, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు కూడా ప్రజలు పోటెత్తుతున్నారు. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన యువగళం సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.
జనంతో కిక్కిరిసిపోయిన సభతో సెల్ఫీ తీసుకున్న నారా లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. మీరు ఎద్దేవా చేశారు కదా.. ఇప్పుడు ఏమంటారు? అని ప్రశ్నించారు. అంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు.. నారా లోకేష్ వరకు కూడా ఎక్కడ సభ పెట్టినా.. ఎక్కడ ఉన్నా.. చీమల దండులా జనాలు చుట్టుముడుతున్నారు. ఈ పరిస్థితిని కొన్నాళ్ల కిందటి వరకు వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
జీవో 1 ను చూపించి పోలీసులు కూడా పాదయాత్ర తొలి నాళ్లలో అడ్డంకులు సృష్టించారు. కుర్చీలు.. మైకులు తీసుకువెళ్లిపోయారు. తర్వాత.. ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు అంతా కూడా సాఫీగానే జరుగుతోంది. అయితే.. దీనివెనుక జగన్ చేసిన సూచనలే ఉన్నాయనేది వైసీపీ నేతల మాట. జనాలకు మనం నవరత్నాలు ఇస్తున్నాం. దీంతో వైసీపీవైపే వారంతా ఉన్నారు. టీడీపీ ఏం చేసినా.. ప్రజలనుంచి మద్దతు లభిం చదు. వారిని అలా వదిలేయండి! అని జగన్ అన్నట్టుగా ప్రచారంలో ఉంది.
అందుకే.. ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా యువగళం పాదయాత్ర జరుగుతోంది. ఇక, చంద్రబాబును అడ్డుకుంటున్నా.. సీఎంవో నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వద్దు.. మౌనంగా ఉండాలని నాయకులను హెచ్చరిస్తున్నారు. దీంతో టీడీపీ సభలుసజావుగానే (దాదాపు) జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు అదే జగన్ అంతర్మథనంలో పడుతున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఎక్కడా లేని టెన్షన్ స్టార్ట్ అయ్యిందట.
ఎందుకంటే.. అటు చంద్రబాబు సభలకు.. ఇటు నారా లోకేష్ సభలకు వస్తున్న జనాలు.. అనేక సమస్యలు చెబుతున్నారు. అనేక కష్టాలుచెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. వీరంతా కూడా.. పథకాలు తీసుకుంటున్నవారే కావడం గమనార్హం. ఈ పరిణామాలపై సీఎం జగన్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది.
ఇలా ఎందుకు జరుగుతోంది. ఇంత చేస్తున్నా.. ఎందుకు అంతమంది వస్తున్నారు? ఇన్ని కష్టాలు ఎందుకు చెబుతున్నారు? అని ఆయన తన అంతరంగిక పరివారంతో చర్చిస్తున్నారని సమాచారం. దీనికి సమాధానం అయితే..ప్రస్తుతానికి దొరకడం లేదని అంటున్నారు.