వర్షాకాలంలో వర్షాలతో పాటు వ్యాధులు కూడా మన వెంట వస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, విరోచనాలు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలా ఎన్నో రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ సర్వసాధారణంగా అందరిలోనూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ వ్యాధుల నుంచి పిల్లలు, రక్త పోటు సమస్యలు ఉన్నవారు, థైరాయిడ్ లాంటి ఇబ్బందులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరం. చాలామంది వర్షాకాలం వచ్చేటప్పటికి నీరు తాగడం తగ్గించేస్తారు. కాని వర్షాకాలంలో కూడా వాతావరణం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగిపోయి డిహైడ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వర్షాకాలంలో కూడా శరీరానికి తగిన నీరు తాగాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నీటితోపాటు హెర్బల్ టీలు, సూప్లు, అల్లం టీలు తాగాల్సి ఉంటుంది.
ఇది శరీరంలోని హీట్ పర్సంటేజ్ పెంచడమే కాక రోగనిరోధక శక్తిని పెంచి వర్షాకాలం నుంచి వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది. వీటితో పాటు ఆ సీజన్లో దొరికే ఆపిల్స్, దానిమ్మ, నారింజ పండ్లను కచ్చితంగా తీసుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది. పండ్లను తినే అలవాటు ఉండటం వల్ల శరీరంలోని ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సరిపడా లభిస్తాయి. విటమిన్ సి ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, ద్రాక్ష ఇలాంటి పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
వర్షాకాలంలో ఈజీ డైజెస్టివ్ ఫుడ్ అంటే బ్రౌన్ రైస్, ఓట్స్, చికెన్, ఫిష్ లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి కండరాలు పెరుగుదలకు తోడ్పడుతుంది. వర్షాకాలంలో సహజంగా చాలామందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని నుంచి రక్షించుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లి సహజంగా యాంటీఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి మనల్ని మనం రక్షించుకోవడానికి సహకరిస్తాయి.