గుడివాడ టీడీపీ టిక్కెట్‌పై ట్విస్ట్‌.. లోకేష్ అలా.. చంద్ర‌బాబు ఇలా…!

గుడివాడ తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో పరిస్థితులు తలకిందులు అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు సైతం దీర్ఘలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము చెప్పేవరకు గుడివాడ నియోజకవర్గంలో కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలని.. అటువైపు వెళ్ళవద్దని వినిగడ్డ రాముకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో రాము సైతం హైదరాబాద్‌కు పరిమితం కావాలా ? లేదా అమెరికాకు ప‌య‌న‌మ‌వ్వాలా అన్న సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తుంది.

గత పది రోజులుగా గుడివాడ టికెట్ విషయంలో టిడిపిలో అంతర్గత చర్చలు గట్టిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావుని ఈసారి ఎలాగైనా ఓడించాలని కసితో ఉంది టిడిపి అధిష్టానం. ఈ క్రమంలోనే ఎన్నారై అయినా వెనిగండ్ల‌ రామును చంద్రబాబు, లోకేష్ గత కొద్ది రోజులుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ప్రధానంగా లోకేష్ ఆశీస్సులు రాముకు గట్టిగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈసారి టికెట్ త్యాగం చేసి రాము గెలుపు కోసం పని చేయాలని చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు సూచించారు. పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు, మాజీమంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను గుడివాడలో రావి ఇంటి వద్దకే చంద్రబాబు రాయబారానికి పంపినట్లు తెలిసింది.

అయితే రావి మాత్రం డబ్బులు కట్టలతో వచ్చిన వరకే టికెట్ ఇస్తాం.. వారు పోటీ చేస్తారు.. మీరు పక్కకు తప్పుకోమంటే కుదరదని.. గతంలో కూడా ఇలాగే తాను కష్టపడి చివర్లో సీటు త్యాగం చేశానని.. ఖర్చు పెట్టుకోలేన‌ని తనపై అభాండాలు వేస్తున్నారని.. నా స్థాయిలో నేను ఖర్చుకు సిద్ధం.. మిగిలింది పార్టీ భరించాల్సిందే అని రావి అచ్చెం న్నాయుడు వద్ద కాస్త స్వరం పెంచి చెప్పినట్టు సమాచారం. దీంతో వీరిద్దరూ కలిసి రావి మాటను చంద్రబాబుకు చెప్పారట.

ఒకవేళ గుడివాడ నుంచి వెనిగండ్ల‌ రాముని పోటీ చేయించాలి అనుకుంటే తాను తప్పుకుంటానని.. మీరే చేసుకొండని తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని రావి వెంకటేశ్వరరావు చెప్పినట్టు సమాచారం. విచిత్రం ఏంటంటే రావికి దన్నుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల సీనియర్ నాయకులు.. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నారు. అటు వెనిగళ్ళ రాముకు సపోర్ట్ గా ఎన్నారైలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకేష్ ఆశీస్సులతో నియోజకవర్గంలో తిరుగుతున్న వెనిగళ్ళ రాము మరోసారి లొకేష్‌ను కలిసి టిక్కెట్టు వస్తుందో ? రాదో అన్నదానిపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.