తెలుగు సినిమాల టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు అది కూడా అనుమతి ఉంటేనే టిక్కెట్ రేట్ల పెంపు అనుమతి ఇస్తున్నారు. అదే చిన్న సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచి అమ్మేందుకు ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. ఇక పెద్ద సినమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవాలన్నా కూడా మేకర్స్ ముందుగానే ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవాలి.
అప్పుడే ప్రభుత్వం ఆలోచించి టిక్కెట్ రేట్లు ఎంత పెంచుకోవాలో అనుమతులు ఇస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలోని సీఎంఓలో ఏపీ సీఎం జగన్తో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, కృష్ణారెడ్డితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన వివేక్ భేటీ కానున్నారు.
ఈ సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వం ఆదిపురుష్ సినిమాకు ప్రతి టిక్కెట్ రేటుపై రు. 50 పెంపునకు అనుమతిస్తుందని తెలుస్తోంది. ఈ పెంపు జరిగితే అప్పుడు ఏపీలో ఆదిపురుష్ రు. 227 టిక్కెట్ రేటుతో రిలీజ్ అవుతుంది. దీనిపై ఈ రోజు లేదా రేపు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే ఛాన్స్లు ఉన్నాయి.
ఈ రేట్ల పెంపు ఖచ్చితంగా ఆదిపురుష్ సినిమాకు మంచి ఓపెనింగ్స్తో పాటు మంచి కలెక్షన్లు రావడానికి హెల్ఫ్ అవుతుంది. ఇక యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ రాముడు గా నటిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.