ఎవరు ఏ రంగంలో ఉన్నా చాలా మందికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. కొందరికి పుస్తకాలు చదవడం, మరికొందరికి సినిమాలు చూడడం, ఇంకొందరికి క్రీడలు ఇలా ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. ఇందుకు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత కూడా అతీతమేమీ కాదు. సినిమాలలో తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకర్షించిన ఆమె రాజకీయాల్లోనూ తనదైన ఒరవడిని సృష్టించారు.
రాజకీయాల్లోనూ సూపర్ హిట్ అయి ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అలాంటి జయలలితకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆమె తన చిన్నప్పటి నుంచి క్రికెట్ను బాగా ఇష్టపడే వారట. క్రికెట్ మగవాళ్ల ఆట అని ఆమె తమ్ముడు ఆమెను ఆట పట్టించే వాడట. అయినా క్రికెట్పై ఆమె తన ఇష్టాన్ని మార్చుకోలేదు. పైగా మరింత పెరిగింది. దానికో కారణం కూడా ఉంది.
క్రికెట్ పుట్టుపూర్వోత్తరాల గురించి ఆమె తెలుసుకునే క్రమంలో ఓ పుస్తకాన్ని జయలలిత చదివారు. అందులో క్రికెట్ను కనిపెట్టిందే ఆడవారు అనే విషయం తెలిసింది. దీంతో ఆమెలో మరింత ఉత్సాహం పెరిగింది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న తరుణంలో ఆమె క్రికెట్ అంటే తనకున్న ఇష్టం గురించి పత్రికలో ఒక వ్యాసం రాశారు.
అందులో తనకు ఇష్టమైన క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ అని పేర్కొన్నారు. ఆయన ఫొటో ఏదైనా పేపర్, మ్యాగజైన్లో పడితే దానిని కత్తిరించి, ఎంతో అపురూపంగా దాచుకునే దానినని ఆమె తెలిపారు. ముఖ్యంగా తన ఫ్రెండ్తో కలిసి ఆమె చెన్నైలో టెస్ట్ మ్యాచ్ ఉంటే ఐదు రోజులూ చూసే వారట.
ఇక సీఎం అయిన తర్వాత క్రికెట్ మ్యాచ్లు జరిగితే కనీసం రన్నింగ్ కామెంట్రీ అయినా వినేవారట. ఇంతలా క్రికెట్ను అభిమానించే మరో సీఎం ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాలు, రాజకీయాలలో ఎంతో పేరు సంపాదించిన ఆమె క్రికెట్కు ఎంతో అభిమాని అని చాలా మందికి తెలియదు.