హీరోయిన్ కావాలనే బోలెడన్ని కలలతో సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది అందగత్తెలు అడుగుపెడుతుంటారు. అది కుదరక చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటారు. అయితే ఏ క్యారెక్టర్ దొరికినా సరే వారు అందులో లేనమైపోయి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో లక్ష్మీ లహరి అలియాస్ లక్ష్మీ శర్మ ఒకరు. అందానికి నిలువెత్తు రూపంగా నిలిచే ఈ ముద్దుగుమ్మ అమ్మ ఒకటో తారీఖు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది కానీ అవి ఏమీ తనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
అయితే 2002లో వచ్చిన ఇంద్ర మూవీలో లక్ష్మీ చిరంజీవి మేనకోడలు నందినిగా నటించింది. ఆ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఈ తార తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తదనంతరం లక్ష్మి పెద్దగా ఆడని సినిమాల్లో నటించింది. చివరికి ఆరుగురు ప్రతివ్రతల్లో కూడా యాక్ట్ చేసింది. అయినా తెలుగు చలనచిత్ర సీమలో ఒక్క హిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
పుట్టి, పెరిగింది తెలుగు నేలపైనైనా సొంత ఇండస్ట్రీలో ఆమె సక్సెస్ కాలేక పోయింది. అయినా నిరాశ పడిపోకుండా అవకాశాలు వచ్చినంత వరకు తన వంతుగా ట్రై చేసింది. చివరికి ఆఫర్స్ లేక మాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. మొదటగా మమ్ముట్టి సరసన పలన్కు (2006) సినిమాలో యాక్ట్ చేసింది. ఒక డ్రామా ఫిలింగా వచ్చిన పలన్కులో మమ్ముట్టి భార్యగా, నజ్రియా నజీమ్ తల్లిగా ఈ ముద్దుగుమ్మ కనిపించింది. చక్కని స్టోరీతో వచ్చిన పలన్కు సూపర్ హిట్ అయింది.
దాంతో మలయాళం సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీ శర్మకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. అవన్నీ ఒప్పుకుంటూ లక్ష్మి సంవత్సరానికి 4 నుంచి 9 వరకు సినిమాలు చేసింది. వాటిలో దాదాపు అన్ని సక్సెస్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్గా స్థాయికి కూడా చేరుకుంది. తన బ్యూటిఫుల్ లుక్స్, టాలెంట్తో మలయాళ ఇండస్ట్రీని దున్నేసిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
తెలుగు, మలయాళ సీరియస్లలో కూడా కొన్ని క్యారెక్టర్లు వేసి మెప్పించింది. ఇప్పటికీ మలయాళ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళంలో ఆడుజీవితం మూవీ చేస్తోంది. ఒకప్పుడు ఇంద్ర ద్వారా అలరించిన లక్ష్మీ ఇక్కడ కాకపోయినా మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాణించిందని తెలిసి టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషిస్తున్నారు.