టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు హీరోలుగా ఉన్న సమయంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. వీరందరూ తెలుగులోని స్టార్ హీరోలు అయినా మల్టీస్టారర్ సినిమాలు చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా నటించేవారు. ఏ హీరో కూడా తాను గొప్ప అన్న ఫీలింగ్ తో ఉండేవారు కాదు. అయితే ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం ప్రారంభమయ్యాక ప్రతి హీరోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది.
హీరోల అభిమానుల మధ్య పోటీలు, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎవరికి వారు తమ హీరోయే గొప్ప అన్న పంతానికి పోయేవారు. పైగా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర పెద్దపెద్ద గొడవలు జరిగేవి. అందుకే ఆ జనరేషన్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించలేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. స్టార్ హీరోలుగా ఉన్న రామ్చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా కలిసి నటిస్తున్నారు.
ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. మల్టీస్టారర్ సినిమాలలో నటించే విషయంలో వెంకటేష్ ముందు వరుసలో ఉంటున్నారు. అయితే 1990వ దశకంలో చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించే ప్రయత్నం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్పై చలసాని అశ్వినిదత్ ఇందుకు అంకురార్పణ చేశారు. చిరంజీవి – వెంకటేష్ కూడా ఇందుకు ఓకే చెప్పారు.
అయితే వీరిద్దరి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ కథ సరిగా రాలేదట. దీంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి చిరంజీవి హీరోగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను తెరకెక్కించారు. ఆరోజు ఆ మల్టీస్టారర్ సినిమాకు సరైన కథ దొరికి ఉంటే వెంకటేష్, చిరంజీవి మల్టీస్టారర్ సినిమా చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఉండేది.