రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకే రోజు భారీ రికార్డును నమోదు చేసింది. ప్రజల ఆదరణ.. వారి సానుకూలత ఏ రేంజ్లో ఉందో కళ్లకు కట్టే ఘటనలు ఒకే రోజు జరగడం గమనార్హం. ఒకవైపు పులివెందుల.. మరోవైపు వినుకొండ.. నియోజకవర్గాలు.. ఈ భారీ రికార్డుకు వేదికలుగా మారాయి. బుదవారం ఒకే రోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు.. ప్రజల మధ్య ఉన్నారు. సభలు నిర్వహించారు. ఈ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
పులివెందుల నిజంగా వైసీపీ అదినేత, సీఎం జగన్కు అడ్డా అనే పేరుంది. ఇక్కడ వైఎస్ కుటుంబానికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అలాంటినియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటనే ఒక ఆశ్చర్యకరం. పైగా ఎన్నికలకుముందు నిర్వహించిన ఈ సభలకు.. సమావేశాలకు.. మరింత ప్రాధాన్యం లభించింది. అలాంటి కీలకనియోజకవర్గంలో చంద్రబాబు సభకు ప్రజలు భారీగా పోటెత్తారు. ఇసకేస్తే రాలనంత జనం ఎగబడి వచ్చారు. చంద్రబాబు చేసిన ప్రతి కామెంట్కు చప్పట్లతో హోరెత్తించారు. అంతేకాదు .. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎలా వచ్చారో.. కూడా తెలియనంతగా.. ప్రజలు చీమలదండులా తరలి వచ్చి.. చంద్రబాబు సభను ఊహించని విధంగా విజయవంతం చేశారు.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్.. చేస్తున్న యువగళం పాదయాత్ర.. వినుకొండలో సాగింది. నిజానికి ఇది టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గమే అయినా.. ఇటీవల ఇక్కడ వైసీపీ దూకుడు పెరగడం.. రెండు మూడు రోజుల కిందట ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వర్సెస్ టీడీపీ నాయకులకు మధ్య వివాదం ఏర్పడడం.. పోలీసు గాలిలోకి కాల్పులు జరపడం వంటి ఘటనలతోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో నారాలోకేష్ చేపట్టిన పాదయాత్రపై పరోక్షంగా వైసీపీ నాయకులు కన్నేశారు. ఈ యాత్రను విఫలం చేయాలనే వ్యూహాలను అమలు చేసినట్టు పార్టీ నాయకులు తెలిపారు. అయినప్పటికీ.ఇక్కడ ప్రజలు నారా లోకేష్కు బ్రహ్మరథం పట్టారు.
భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు నారా లోకేష్కు అడుగడుగునా హారతులు పట్టారు. ఇక, స్థానిక ఎమ్మెల్యేపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు.. యువత ఈలలతో విజృంభించారు. టీడీపీ శ్రేణుల్లోనూ భారీ ఉత్సాహం కనిపించింది. మొత్తంగా ఒకే రోజు బుధవారం .. టీడీపీ అధినేత చంద్రబాబు అటు సీఎం సొంత నియోజకవర్గంలోను.. నారా లోకేష్ ఇటు వినుకొండలోనూ ప్రజల నుంచి బ్రహ్మరథం పట్టించుకోవడం.. నిజంగానే పార్టీ చరిత్రలో ఒక హిస్టరీ అంటున్నారు పార్టీ నేతలు.