తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం తెలుగుదేశం రాజకీయాలు గత ఏడాదికాలంగా వేడెక్కిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లోను ఆయనే పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటరాజు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గాలు వెంకటరాజుకు అంతగా సహకరించిన పరిస్థితి లేదు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడుతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముళ్ళపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడికే సీటు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. బాపిరాజు తెరవెనక ఉండి చాలా కథ నడిపిస్తున్నారు. అయితే పార్టీ గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాక పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ ప్రోగ్రాం కమిటీ ఇన్చార్జిగాను.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాను కీలక పదవులలో ఉంటూ ఎన్నో సేవలు చేసిన వెంకట్ రాజుకే తాను మాటే ఇచ్చానని… వచ్చే ఎన్నికలలో ఆయనే పోటీ చేస్తారని చంద్రబాబు ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు.
మరోవైపు బాపిరాజుతో పాటు కొందరు నేతలు ముప్పటికి సీటు కోసం ఇప్పటకీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని దొండపూడి లో జరిగిన సభలోను వెంకటేశ్వరరావు భవిష్యత్తు నేను చూసుకుంటాను.. వెంకటరాజును భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని బహిరంగంగా చెప్పారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కోసం చంద్రబాబు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ – మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలో కమిటీ కూడా నియమించారు. ఇటు వెంకటరాజు అటు బాపిరాజు ఇప్పటికే ఈ కమిటీకి తాము చెప్పాల్సింది చెప్పారు.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా వెంకటరాజు సీటు మార్చే ప్రశక్తే లేదని… తాము కూడా గోపాలపురంలో ప్రచారానికి వస్తామని ఇప్పటికే చెప్పేశారు. బాపిరాజు పంతం ఎలా ఉన్నా సమీకరణలు మారుతున్నట్టుగానే తెలుస్తోంది. బాపిరాజు వర్గంగా ముప్పిడి పేరు కొవ్వూరు నుంచి పరిశీలనలో ఉంది. ముప్పిడి ఇప్పటికే కొవ్వూరు సీటు కోసం రు. 5 కోట్లు డిపాజిట్ చేశారన్న ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతోంది. కొవ్వూరుకు ప్రస్తుతం ఇన్చార్జ్ లేరు. అక్కడ టూమెన్ కమిటీయే ఉంది. అక్కడ మాజీ మంత్రి జవహర్కు సీటు ఇవ్వడం కొవ్వూరులో కొందరు కార్యకర్తలకు ఇష్టం లేదు.
గత ఎన్నికల్లోనే కొవ్వూరు సీటు జవహర్కు ఇవ్వలేదు. ఈ సారి గత ఎన్నికలకు ముందే పరిస్థితే బలంగా ఉంటే కొవ్వూరుకు ముప్పిడి పేరు బలంగా పరిశీలనలో ఉంటుంది. అయితే అదే సమయంలో గోపాలపురంలో వెంకటరాజును గెలిపించే విషయంలో కీలకంగా ఉండాలని బాపిరాజును కూడా అధిష్టానం కోరనుంది. ఇక ఎన్నికల తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ లేదా.. మరో ప్రత్యామ్నాయ పదవిని బాపిరాజుకు కట్టబెట్టే ఛాన్సులు ఉన్నాయి.