‘ బ్రో ‘ షోలు క్యాన్సిల్‌… రెండు థియేట‌ర్ల ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మేన‌లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెర‌కెక్కిన‌ బ్రో మూవీ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెలకొంది. బెనిఫిట్ షో తోనే సినిమా ప‌ర్లేద‌న్న టాక్‌ సంపాదించుకోవడంతో ఫాన్స్ థియేటర్స్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలిలో లతా థియేటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బ్రో సినిమా రన్ అవుతున్న టైంలో సౌండ్ సిస్టం ఫెయిల్‌ కావడంతో యాజమాన్యం షో ని ఆపివేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు థియేటర్ వద్ద నానా రచ్చ చేశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు థియేటర్స్ యాజమాన్యానికి మధ్య గొడవలు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా మరోపక్క గూడూరు సింగం థియేటర్ వద్ద కూడా ఉద్రిక్త‌ వాతావరణం నెలకొంది.

సినిమా విడుదల సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో పవన్ ఫ్యాన్స్ లో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఇరువర్గాలు గొడవకు దిగడంతో గొడవ పెద్దద‌వ‌ కూడదనే ఉద్దేశంతో థియేటర్ యజమానులు పవన్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కలిసి థియేటర్ వద్ద గొడవ మొదలుపెట్టారు. మళ్లీ థియేటర్స్ యాజమాన్యం ఆ ఫ్లెక్సీలు తీసుకువచ్చి పెట్టడంతో ఆ గొడ‌వ‌ సద్దుమణిగింది.