బాలయ్య- శ్రీదేవి కాంబోలో ‘ జగదేకవీరుడు అతిలోకసుందరి ‘ ని మించి రావాల్సిన సినిమా ఎందుకు ఆగింది..!

నటరత్న ఎన్టీఆర్- అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానుల గుండెల్లో ఆనందం ఉప్పెనలా ఉప్పొంగుతుంది. వేటగాడు సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది ఈ కాంబో. ‘బడిపంతులు’ సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి సరిగా ఏడు సంవత్సరాలు తర్వాత మళ్లీ ఆయనకు జంటగా నటించడం వేటగాడు సినిమాకు ప్రత్యేకత.. నిన్న కాక మొన్న వడిలో కూర్చున్న చిన్నపిల్ల హీరోయిన్ అని మొదట ఎన్టీఆర్ ఆమెతో నటించడానికి ఒప్పుకోలేదట.

అదే సమయంలో ఎన్టీఆర్‌కు జంటగా వాణిశ్రీ, జయసుధ జయప్రద వంటి హీరోయిన్లు నటించేవారు. శ్రీదేవి కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. కొత్త కాంబినేషన్ బాగుంటుందని ఎన్టీఆర్‌కు నచ్చచెప్పి రాఘవేందర్రావు వేటగాడు సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా శ్రీదేవిని ఒప్పించారు. ఈ సినిమాపై బయట ఎంత చెడు ప్ర‌చారం జ‌రిగినా రాఘవేంద్రరావు అసలు వెనక అడుగు వేయలేదు.

ఇక సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్- శ్రీదేవి జంటకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి కాంబినేషన్లో కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ త‌న‌యుడు బాలకృష్ణ- శ్రీదేవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు 1991 లో ఒక శుభవార్త బయటకు వచ్చింది.

రాఘవేంద్రరావు, నందమూరి బాలకృష్ణ, అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్లో ఓ భారీ సినిమా రాబోతుందని వార్తను 1991 జనవరి నెలలో న్యూస్ పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి. మెగాస్టార్ చిరంజీవితో రాఘవేంద్రరావు కాంబినేషన్లో జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి విజువల్ వండర్ నిర్మించిన అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రాబోతుంది అంటూ ఆనాటి పత్రికలు రాసుకొచ్చాయి.

ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం 1991 మే నెలలో స్విట్జర్లాండ్‌లో ప్రారంభమవుతుందనీ నాటి పత్రికల్లో పేర్కొన్నారు. సినిమా స్కోపులో ఫోర్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌లో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తారని, విన్సెంట్ ఛాయాగ్రహకుడని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి కనుక అందరినీ అలరించే విధంగా ఓ వెరైటీ కథను తయారు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

అప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా గురించి కొత్త వార్తలు ఏమీ రాలేదు. స్విట్జర్లాండ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు చివరకు నిరాశ మిగిలింది. ఇలా తొలి అడుగులనే బాలకృష్ణ- శ్రీదేవి కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయడానికి ఏ నిర్మాత ప్రయత్నించలేదు. తర్వాత బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అశ్విని దత్ కాంబినేషన్లో అశ్వమేధం సినిమా వచ్చింది. ఇందులో నగ్మా హీరోయిన్‌గా నటించారు. అలా బాలయ్య – శ్రీదేవి కాంబోలో రావాల్సిన భారీ సినిమా ప్రకటన దశలోనే ఆగిపోయింది.